కేదార్నాథ్ యాత్రలో అతి తెలివి: అంబులెన్స్లను ట్యాక్సీలుగా మార్చి చిక్కుల్లో పడ్డ యాత్రికులు!
అతి తెలివి ప్రదర్శించడం అన్నిసార్లూ మేలు చేయదు, కొన్నిసార్లు అది మనల్ని పెద్ద చిక్కుల్లోకి నెట్టేస్తుంది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న కొందరు భక్తుల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. పవిత్రమైన కేదార్నాథ్ ధామాన్ని సందర్శించేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ యాత్ర ఎంతో కష్టతరమైనది, అయినా భక్తిభావంతో అనేక మంది క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తూ ముందుకు సాగుతారు. అయితే, కొందరు యాత్రికులు క్యూ తప్పించుకోవడానికి, త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ఒక షార్ట్కట్ ఆలోచించారు. మెడికల్ ఎమర్జెన్సీ అని నాటకం ఆడి, అంబులెన్స్లను ట్యాక్సీలుగా మార్చుకుని కేదార్నాథ్ వైపు దూసుకెళ్లారు. సామాన్యులకు తెలియకపోయినా, ఈ దొంగదారి ప్రయత్నం ఆ కేదారేశ్వరుడికి తెలిసి ఉంటుందని, అందుకే వీరిని పోలీసులు అడ్డగించేలా చేశాడని భక్తులు అనుకుంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు వెల్లడించిన విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి.

పోలీసులకు పట్టుబడిన ‘అతి తెలివి’ అంబులెన్స్లు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేదార్నాథ్ యాత్ర మార్గంలో సోన్ప్రయాగ్ దగ్గర వారు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో రెండు అంబులెన్స్లు సైరన్లు మోగిస్తూ హడావుడిగా వెళుతూ కనిపించాయి. సాధారణంగా అంబులెన్స్లు ఎమర్జెన్సీ ఉంటేనే ఇలా వెళ్తాయి. ఎవరైనా బాగా లేకపోతే, వారు గౌరీకుండ్ వెళ్ళరు.. సోన్ప్రయాగ్, రాంపూర్ లేదా రుద్రప్రయాగ్ వైపు వెళ్తారు. దానికి తోడు ఆ రోజు ఎటువంటి ప్రమాదం జరగలేదని పోలీసులకు సమాచారం ఉంది. ఇక అంబులెన్స్లు వెళ్తున్న గౌరీకుండ్లో ఆసుపత్రి కూడా లేదు. మరి అంబులెన్స్లు ఎందుకు ఇంత హడావుడిగా గౌరీకుండ్ వైపు వెళ్తున్నాయి అని పోలీసులకు అనుమానం వచ్చింది.
డబ్బు కోసం అంబులెన్స్లను టాక్సీలుగా మార్చిన డ్రైవర్లు
అంబులెన్స్ డ్రైవర్లను నిఖిల్ విల్సన్ మాసిహ్, కృష్ణ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. వారిని విచారించగా, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు తీసుకుని యాత్రికులను గౌరీకుండ్ వరకు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఒక అంబులెన్స్లో ఒక యాత్రికుడు, మరొక అంబులెన్స్లో ఇద్దరు భక్తులు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అంబులెన్స్లను ఇలా ట్యాక్సీల్లాగా ఉపయోగించడం చూసి పోలీసులు కంగుతిన్నారు. సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ మధ్య దూరం కేవలం 2 కిలోమీటర్లు కూడా ఉండదు. సాధారణంగా ఈ మార్గంలో నడుచుకుంటూ వెళ్లవచ్చు లేదా షేర్డ్ షటిల్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. గౌరీకుండ్ నుంచే కేదార్నాథ్ యాత్ర అసలు ప్రారంభమవుతుంది. పోలీసులు పట్టుకున్న అంబులెన్స్లలో ఒకటి ఎయిర్ కండిషన్డ్ లగ్జరీ మోడల్ కాగా, దీనిని ఒక యాత్రికుడు ప్రత్యేకంగా బుక్ చేసుకున్నాడు. మరొకటి సాధారణ అంబులెన్స్. హరిద్వార్ నుంచి వచ్చేటప్పుడు, ఈ డ్రైవర్లు కొంతమంది యాత్రికులను ఎక్కించుకుని అంబులెన్స్లను ట్యాక్సీల్లాగా మార్చేశారని పోలీసులు వివరించారు.
పోలీసుల సీరియస్ చర్యలు, యాత్రికులకు హెచ్చరికలు
అయితే, అంబులెన్స్లో ఉన్న ముగ్గురు యాత్రికులు పోలీసులను చూడగానే అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. తక్షణమే అంబులెన్స్లను సీజ్ చేశారు, డ్రైవర్లకు భారీ చలాన్లు విధించారు. యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్గంలో, అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన అంబులెన్స్లను ఇలా దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరం అని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేదార్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులు అందరూ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అడ్డదారులు తొక్కవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి చర్యలు యాత్రకు ఆటంకం కలిగించడమే కాకుండా, నిజమైన అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ల సేవలకు కూడా అడ్డుపడతాయని గుర్తు చేస్తున్నారు.
Read also: Guyana: గయానాలో చమురు నిక్షేపాలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్