కేంద్రంలోని మోదీ సర్కారు రెండేళ్ల కిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ-హైస్పీడ్ వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం పలు మార్గాల్లో ఈ రైళ్లు చైర్కార్గానే నడుస్తోన్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ స్లీపర్ రైలు ట్రయల్ రన్ పూర్తయ్యింది. వందేభారత్ సెమీ-హైస్పీడ్ రైలు సుదూర ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. రైల్వే రిసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ముంబయి – అహ్మదాబాద్ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించింది.

ఈ కొత్త స్లీపర్ రైళ్లు ప్రముఖ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా మరియు బెంగుళూరు వంటి గమనించే మార్గాలలో ఉపయోగపడతాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే ప్రజలకు ఎక్కువ సౌకర్యంతో కూడిన ప్రయాణం అందించేందుకు రైల్వే నిరంతరం పని చేస్తోంది. జనవరి 15న మొత్తం 16 కోచ్లతో పట్టాలపై ఈ రైలు పరుగులు తీసింది. త్వరలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు సిద్ధమైంది. ట్రయల్ రన్ డేటాను విశ్లేషించిన అనంతరం ఆర్డీఎస్ఓ తుది ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఈ రైలు గరిష్ఠ వేగాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్ పరిశీలించనున్నారు. గతేడాది డిసెంబరులో వందేభారత్ స్లీపర్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసి.. ట్రయల్ రన్కు అప్పగిచింది. జనవరి తొలివారం రాజస్థాన్లోని కోటాలో 30-40 కిలోమీటర్ల స్వల్ప దూరంలో ట్రయల్ రన్ చేపట్టారు. ఈ సమయంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. రాబోయే కాలంలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రాత్రి ప్రయాణాన్ని పునర్నిర్వహించబోతున్నాయని రైల్వే శాఖ పేర్కొంది.
ప్రోటోటైప్ విజయవంతమైన ట్రయల్ రన్ పూర్తి చేసిందని తెలిపింది.ఈ ఏడాది మరో తొమ్మిది వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ భావిస్తుంది. ప్రస్తుతం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) వీటి నిర్మాణం ప్రారంభించింది. ఏప్రిల్, డిసెంబర్ మధ్య ఈ రైళ్లను డెలివరీ చేయనుంది. ఈ రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, త్రీ టైర్ ఏసీతో కలిసి మొత్తం 16 బోగీలు.. మొత్తం 1,128 బెర్తులు అందుబాటులో ఉంటాయి. అధునాతన సౌకర్యాలు, ప్రమాదాలను నివారించే ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. కాగా, 24 వందే భారత్ స్లీపర్ రైళ్లకు 50 ర్యాక్ల కోసం గత నెలలో రైల్వే శాఖ ఆర్డర్ ఇచ్చింది.
హైదరాబాద్కు చెందిన మేధా సెర్వో డ్రైవ్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఫ్రెంచ్ మ్యానుఫ్యాక్చరర్ అలస్టమ్ ఈ ఆర్డర్ను దక్కించుకున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇవి సిద్ధమయ్యే అవకాశం ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 24 సెట్స్ ఉత్పత్తి కానున్నాయి. ఇది రైల్వే సాంకేతికతలో భారత్ స్వావలంభనను మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది.