భారతదేశంలో వైద్యారోగ్య రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యంగా పేద మరియు అణగారిన వర్గాలకు నాణ్యమైన చికిత్స అందుబాటులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలువుతున్న విప్లవాత్మక పథకాల వల్ల సామాన్యుడికి వైద్యం భారం కాకుండా మారుతోందని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ (PM-JAY) పేదలకు వరంలా మారిందని నడ్డా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎటువంటి ఆలస్యం లేకుండా అత్యుత్తమ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందుతోందని తెలిపారు. ముఖ్యంగా, ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ ఆదాయం, కులం లేదా మతంతో సంబంధం లేకుండా ఉచిత వైద్య బీమా కల్పించడం ఒక చారిత్రాత్మక ఘట్టమన్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, ప్రతి వృద్ధుడికి గౌరవప్రదమైన ఆరోగ్య భద్రత లభిస్తుందని ఆయన వివరించారు.
Latest News: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
దేశంలో డాక్టర్ల కొరతను తీర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. 2029 నాటికి దేశవ్యాప్తంగా అదనంగా 75 వేల మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. గతేడాది ఒక్క ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 23 వేల సీట్లు పెంచడం మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. కొత్తగా ఎయిమ్స్ (AIIMS) వంటి ఉన్నత విద్యా సంస్థలను స్థాపించడంతో పాటు, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా వైద్యుడయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు.

గతంలో ఖరీదైన చికిత్సలు కేవలం ధనికులకు మాత్రమే పరిమితమయ్యేవని, కానీ నేడు డిజిటల్ హెల్త్ మిషన్ మరియు జన ఔషధి కేంద్రాల ద్వారా సామాన్యుడికి కూడా తక్కువ ధరకే మందులు, చికిత్స అందుతున్నాయని నడ్డా వివరించారు. రాబోయే ఐదేళ్లలో భారతదేశం వైద్య రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ప్రపంచానికి ‘మెడికల్ హబ్’గా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక యంత్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com