రామ్ కేవల్ సాధించిన విజయం చిన్నదేమీ కాదు. ఇది ఒక వ్యక్తిగత గెలుపు మాత్రమే కాదు, ఓ గ్రామం తలెత్తుకునే ఘట్టం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ గ్రామంలో ఒక విద్యార్థి పదో తరగతి పాసవ్వడం ఇదే తొలిసారి. ఇది నిజాంపూర్ గ్రామ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
గ్రామస్తుల హర్షం
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లా నిజాంపూర్ గ్రామంలో ఓ కుర్రాడు పదో తరగతి పరీక్షల్లో పాసయ్యాడు. దీంతో ఆ కుర్రాడి కుటుంబం మాత్రమే కాదు ఊరుఊరంగా సంబురపడ్డది. తమ ఊరికి పేరు తెచ్చాడని ఆ బాలుడిని కొనియాడింది. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పిలిపించుకుని శాలువా కప్పి సత్కరించారు. పైచదువులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ బాలుడు స్టేట్ ర్యాంకు తెచ్చుకున్నాడని అనుకుంటే పొరపాటే జస్ట్ పాసయ్యాడంతే. పదో తరగతి పాసైతే ఊరంతా సంబురపడడం కాస్త అతిగా అనిపించవచ్చు కానీ గ్రామస్థుల మాటలు వింటే మాత్రం మన అభిప్రాయం మార్చుకోవాల్సిందే.
చాల కాలం తర్వాత విజయం
ఈ సంఘటన జిల్లా స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. ఎందుకంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిజాంపూర్ గ్రామంలో పదో తరగతి పాసైన్ వారే లేరట. దాదాపు 8 దశాబ్దాల తర్వాత ఇప్పుడు రామ్ కేవల్ పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్తులంతా సంతోషిస్తున్నారు. రామ్ కేవల్ ను, అతడి తల్లిదండ్రులను గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిజాంపూర్ లో సుమారు 300 మంది నివసిస్తున్నారు. ఇందులో అధిక శాతం నిరుపేద దళితులే పేదరికం కారణంగా చదువుకు దూరమయ్యే వారే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో రామ్ కేవల్ పగటిపూట కూలి పనులకు వెళుతూ రాత్రిపూట కష్టపడి చదివి పదో తరగతి పాసవడంతో అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. రామ్ కేవల్ విజయం చూసి మరెంతో మంది పిల్లలు చదువు పట్ల ఆసక్తి పెంచుకోవచ్చు.
Read also: Bharat : పాకిస్థాన్కు షాక్: భారత్ సలాల్, బాగ్లిహార్ డ్యామ్స్ మూసివేత