ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ను విశాఖపట్నంలో ఆశా వర్కర్లు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్ర సమర్పించి కోరారు. తమను విధుల నుంచి తొలగించకుండా కొనసాగిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఆశా వర్కర్లు తెలిపారు. తమ సమస్యలను నారా లోకేష్ పరిష్కరిస్తారనే నమ్మకం ఉందని.. తాము ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామన్నారు. కొంతమంది తమను విధుల నుంచి తొలగించాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని.. గత ప్రభుత్వ హయాంలో తమను కొందరు ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ సమావేశానికి తీసుకెళ్లారని.. తమకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

తమను రాజకీయాల్లోకి లాగొద్దు
ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని కోరారు ఆశా వర్కర్లు. మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని.. మెప్మా, ఆర్పీల వ్యక్తిగత అకౌంట్లోకి డబ్బుల్ని జమ అయ్యే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా, విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో ఆర్పీలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. తాము ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటుగా పేద మహిళలకు డ్వాక్రా గ్రూపులు పెట్టి, బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ సమావేశాలకు మహిళలను సమీకరించడం వంటివి కూడా తామే చేస్తున్నామన్నారు.
బ్యాంక్ అకౌంట్లలో జమ
తమకు ఇచ్చే జీతాలను వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ఎన్నికల సమయంలో చంద్రబాబుకు తెలిపామని ఆశా వర్కర్లు గుర్తుచేశారు. తమకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఆ హామీని కూడా అమలు చేయాలని కోరారు. అలాగే మూడేళ్ల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని.. తమ మీద పని ఒత్తిడిని తగ్గించాలని కూడా కోరారు. అలాగే పెరిగిన ధరలకు తగిన విధంగా వేతనాలు పెంచాలని కోరారు. తమపై రాజకీయ వేధింపులు లేకుండా చూడాలని.. పని భద్రత కల్పించాలని కోరారు. మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారని వారు చెబుతున్నారు. కచ్చితంగా మంత్రి తమ సమస్యల్ని పరిష్కరిస్తారని ఆశా వర్కర్లు ధీమాను వ్యక్తం చేశారు.