ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో కేన్సర్ మహమ్మారి విస్తరిస్తోంది.పచ్చటి పొలాలు, విలాసవంతమైన భవంతులు, నిత్యం వ్యవసాయంతో హాయిగా జీవిస్తున్న గ్రామస్తులు ఇప్పుడు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.ఏడాదిలో 200 మంది కేన్సర్ బారినపడగా, 30 మంది మరణించారు.కాలుష్యమే ప్రధాన కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
16 వేల జనాభా
16 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో కేన్సర్ వ్యాప్తికి అసలు కారణం ఏమిటో ఇప్పటికీ స్పష్టత లేదు. కేన్సర్తో పాటు కాలేయ సంబంధిత వ్యాధులు కూడా గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తావించడంతో ప్రభుత్వం స్పందించింది. కేన్సర్ వ్యాధి విజృంభణను నియంత్రించేందుకు గ్రామంలో వైద్య బృందాలు శిబిరాలను నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ ప్రశాంతి, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఎస్పీఎం విభాగాధిపతి సుజాత ఆధ్వర్యంలో 93 మంది వైద్యసిబ్బంది 31 బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు.
స్క్రీనింగ్ పరీక్షలు
సోమవారం కేన్సర్ అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో ఎవరైనా ఆ కుటుంబంలో కేన్సర్ బారిన పడ్డారా? వారి ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి వివరాలు సేకరించారు. ఆ గ్రామంలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద 23 మంది కేన్సర్ రోగులు ఈ ఆర్ధిక సంవత్సరంలో చికిత్స పొందినట్టు కలెక్టర్ వెల్లడించారు.

నీటి నమూనాలు సేకరణ
భూగర్భ జలాలు, వాయు కాలుష్యం కేన్సర్ వ్యాప్తికి కారణమై ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలోని 25 ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపారు. ఈ నివేదిక రెండు రోజుల్లో రానుందని అధికారులు తెలిపారు. గ్రామానికి సమీపంలో ఉన్న గ్రాసిమ్ పరిశ్రమ వల్లే కాలుష్యం తీవ్రంగా పెరిగి, దీనికి ఫలితంగా కేన్సర్ కేసులు పెరిగాయనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ దర్యాప్తుతో అసలు కారణం ఏంటో త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
జాగ్రత్తలు
కేన్సర్ను నివారించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం అత్యంత అవసరం. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం,మద్యం, పొగత్రాగటం వంటి ఆరోగ్యానికి హానికరమైన అలవాట్లను మానుకోవడం మంచిది .నిత్యం వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం ఎంతో అవసరం.