టూరిజం ప్రమోషన్, పెట్టుబడుల ఆకర్షణ కోసమే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటకాన్ని ప్రపంచానికి చూపిస్తామన్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీలపై కొందరు రాజకీయ కోణంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలు ఏ కోణంలో చూస్తే అలా కనిపిస్తాయని.. ఈ ఈవెంట్కు వందల కోట్లు ఖర్చుపెట్టడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తోందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే రూ.5 కోట్లు కూడా తిరిగి ప్రభుత్వానికి వస్తాయని తెలిపారు.

మమ్మల్ని విమర్శించడమే బీఆర్ఎస్ పని
అలాగే తాము ఫార్ములా ఈ రేసును కూడా తప్పు పట్టలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి చేసిన కోట్ల రూపాయల చెల్లింపులను తప్పు పట్టామని స్పష్టం చేశారు. మమ్మల్ని విమర్శించడమే బీఆర్ఎస్ పని అంటూ మండిపడ్డారు. మాజీ మంత్రి హరీష్ రావుకు రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో పంటలు ఎండినా రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తాము పరిహారం ఇచ్చామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో తరుగు పేరిట రైతులను దళారులు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేసే విమర్శల్లో పసలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

మిస్వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది
మరోవైపు మిస్ వరల్డ్ పోటీల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మిస్వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోని ముద్దుగుమ్మలకు భాగ్యనగరం వేదికకానుంది. భాగ్యనరానికి విదేశీ అతిథుల రాక పెరిగింది. కంటెస్టెంట్లు, అతిధుల రాకతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సందడిగా మారింది. పోటీలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి అందాల భామలు నగరానికి తరలివస్తున్నారు. వారికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈరోజు (మంగళవారం) మిస్ ఫ్రాన్స్ అగథాలో కాయేట్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రమయంలో మిస్ ఫ్రాన్స్ అగథాలో కాయేట్కు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో అధికారుల బృందం స్వాగతం పలికింది. మరోవైపు పోటీలు నిర్వహించే ప్రదేశాలతో పాటు చారిత్రక ప్రాంతాలను అందంగా ముస్తాబు చేశారు. విమానాశ్రయం, హోటల్స్ వద్ద తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. విదేశీయులు విడిది చేసే హోటల్స్ను అందంగా ముస్తాబు చేశారు.
