మిస్ వరల్డ్ పోటీకి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్రానికి ఒక గొప్ప గౌరవం. హైదరాబాద్ ఈ ప్రఖ్యాత కార్యక్రమానికి ప్రధాన వేదికగా నిలుస్తోంది. ప్రస్తుతం భారతదేశం సహా 109 దేశాలకు చెందిన సుందరీమణులు తెలంగాణలో వివిధ నగరాల్లో పర్యటిస్తూ, అక్కడి సాంస్కృతిక సంపదను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్శన ద్వారా, ప్రపంచానికి తెలంగాణలోని అద్భుతమైన వారసత్వం, కళలు, సంప్రదాయాలు, చరిత్ర ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు.

పాతబస్తీ సందర్శన – చౌమహల్లా ప్యాలెస్ వేదికగా సాంస్కృతిక ఉత్సవం
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు పాతబస్తీలో పర్యటించి, తెలంగాణ యొక్క ప్రాచీన వారసత్వాన్ని ఆసక్తిగా పరిశీలించారు. చౌమహల్లా ప్యాలెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంతో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పాతబస్తీలో నిజాం కాలం నాటి వస్తువులు, సైనిక సామగ్రిని తిలకించడానికి, వాటి విశిష్టత గురించి తెలుసుకోవడానికి ప్రపంచ సుందరీమణులు ఎంతో ఆసక్తి చూపారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలు తమనెంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అండ్ సీఈవో జూలియా మోర్లే తెలిపారు.


వరంగల్ పర్యటన – ఖిలా వరంగల్ మరియు కళా ప్రదర్శనలు
ఇప్పుడు తాజాగా 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఐకానిక్ ఖిలా వరంగల్ను సందర్శించారు. అందాల భామలకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, కమిషనర్ సున్ప్రీత్ సింగ్ సాదరంగా ఆహ్వానం పలికారు. వారి కోసం వేయి స్తంభాల గుడిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శిలా తోరణం, వెయ్యి స్తంభాల ఆలయం, వరంగల్ ఫోర్ట్ వంటి చారిత్రక కట్టడాలను, వాటి అద్భుతమైన నిర్మాణ శిల్పాలను, బ్రోచర్లను అందించి, ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని వారి ముందుకు తీసుకువచ్చారు. ఇందులో పాల్గొన్న 22 మంది కంటెస్టెంట్లు తెలంగాణ చీరకట్టు- బొట్టులో మెరిసిపోయారు. తెలంగాణకు గర్వకారణమైన కళంకారి తివాచీలు, జీఐ- ట్యాగ్ సాధించిన చౌపాటి మిర్చి, పాకాల పసుపు గురించిప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పేరిణి శివతాండవం, రుద్రమ దేవి నృత్య రూపకం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు వారిని మంత్ర ముగ్ధులను చేశాయి. సౌండ్ అండ్ లైట్ షో వరంగల్ చారిత్రక వైభవాన్ని కళ్లకు కట్టినట్టు తెలియజేసింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మేయర్ సుధారాణి, ఇతర ప్రముఖులు సందర్శకులకు సావనీర్లను అందజేశారు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వారికి వివరించారు. ఈ తరహా సాంస్కృతిక, చారిత్రక కార్యక్రమాలు తెలంగాణకు ప్రపంచస్థాయిలో గొప్ప గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి.
Read also: Revanth Reddy: సీఈ రమణారెడ్డిని తీవ్రంగా హెచ్చరించిన సీఎం రేవంత్