హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.విద్యార్థులు చెబుతున్న ప్రకారం, యూనివర్సిటీ భూసంపదను రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా అభివృద్ధి చేసి, ఐటీ సంస్థలకు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ భవనాలను ఆనుకుని ఉండటంతో, ఈ భూములు వర్సిటీకి చెందినవేనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎస్ పై ఆగ్రహం
భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. నెమళ్లు, జింకలు, పక్షులకు ఆవాసమైన 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చిందన్న సుప్రీంకోర్టు తెలంగాణ సీఎస్పై సీరియస్ అయింది. అత్యవసరంగా ఎందుకు పనులు చేపట్టారని ప్రశ్నించింది. అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారు పర్యావరణ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్ను ఆదేశించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్దే బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది.ఈ నేపథ్యం లో కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరగడం, ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీనిపై ఓ కమిటీ వేసింది. మంత్రులు భట్టి, శ్రీధర్బాబు, పొంగులేటితో ఓ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్,కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంతో సంబంధం ఉన్న వారితో సంప్రదింపులు జరపనున్నారు కమిటీ సభ్యులు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

విద్యార్థుల విజయం
విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది హైకోర్టు. ఇది హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల విజయమన్నారు కేటీఆర్. కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తే చట్టం ఊరుకోదన్నారు హరీష్ రావు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేసే ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటామన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్రావు. ఈ నెల 7న హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ముగ్గురు మంత్రులతో ఏర్పాటు చేసిన కమిటీ ఎలాంటి నివేదిక ఇవ్వబోతోంది అనేది కూడా కీలకంగా మారింది.