పక్కదారి పట్టకుండా సంచులపై క్యూ ఆర్ కోడ్
విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బాగాంధీ(Kasturibagandhi) బాలికా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విధ్యార్ధులకు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి పేద పిల్లల(Poor Childrens)కు సన్న బియ్యంతో భోజనం వడ్డించనున్నారు. ఈ నెల 12న బడుల్లో సన్న బియ్యం అందచేత కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. బియ్యాన్ని 25 కేజీల సంచిలో ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తారు.

బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు
బస్తాపై రాజకీయ నేతల చిత్రాలు లేకుండా ఇద్దరు చిన్నారుల ఫొటో, పాఠశాల, దానిపై జాతీయ జెండా ఎగురుతున్నట్లు చిత్రం, ప్రభుత్వ లోగోను ముద్రించారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, బడి బయట పిల్లల కోసం నిర్వహించే వసతి గృహాలకు సకాలంలో బియ్యం సరఫరా చేసే భాధ్యతలను మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి. శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ బియ్యంలో మైక్రోన్యూట్రియంటుల సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బియ్యం పక్కదారి పట్టకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బియ్యం నాణ్యతపై ప్రధానోపాధ్యాయుల నుంచి స్టార్ రేటింగ్ రూపంలో అభిప్రాయం స్వీకరిస్తారు. మండలస్థాయి గిడ్డంగుల నుంచి నేరుగా బడులకు చేరవేస్తారు. ప్రతి బస్తాపైన క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. స్టాక్ తీసుకున్నప్పుడు ప్రధానోపాధ్యాయులు కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఏ బస్తాను ఎక్కడ వినియోగిం చాలన్న వివరాలు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరేట్లో ఉంటాయి.