ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన నేపథ్యంలో, పార్టీల మధ్య అంతర్గత వ్యూహాలు మారుతున్నాయి. అధికారంలో ఉన్న మూడు పార్టీలు – టీడీపీ, జనసేన, బీజేపీ – కూటమిగా కొనసాగుతూనే, తమ స్వంతంగా బలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్దమయ్యారు. 2024 ఎన్నికల్లో సంచలన విజయాన్ని సాధించిన పవన్, తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జనసేన ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ లక్ష్యాలను ప్రకటించడంతో పాటు, రాజకీయ దిశను స్పష్టంగా తెలియజేయనున్నారు.

జయకేతనం వేదికగా జనసేన వ్యూహాత్మక ముందడుగు
జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులతో నిండివుంది. 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జనసేన, 2019 ఎన్నికల్లో పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినా, 2024 ఎన్నికల్లో మాత్రం తానొక కీలక శక్తిగా మారిందని నిరూపించుకుంది. కూటమిలో భాగంగా పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందడం పార్టీకి గొప్ప ఊపునిచ్చింది. ఇప్పుడు, డిప్యూటీ సీఎం హోదాలో తన రాజకీయ భవిష్యత్పై స్పష్టతనిచ్చేలా పవన్ ఈ ప్లీనరీలో కీలక ప్రకటనలు చేయబోతున్నారు. ‘జయకేతనం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించడంతో పాటు, వచ్చే ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని వెల్లడించనున్నారు. పార్టీకి స్పష్టమైన రోడ్మ్యాప్తో పాటు, పాలనాపరమైన కీలక నిర్ణయాలను కూడా పవన్ ప్రకటించే అవకాశం ఉంది.
పిఠాపురంలో భారీ ఏర్పాట్లు
ఈ సమావేశాన్ని విశ్వనాయక స్థాయిలో నిర్వహించేందుకు జనసేన నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చిత్రాడలో 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ జరుగనుంది. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా. 2 లక్షల మందికి వసతులు కల్పించేలా ఏర్పాటు చేసిన 7 గ్యాలరీలు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3:45కి వేదిక వద్దకు చేరుకోనున్నారు. పటిష్ఠ భద్రత చర్యలతో 1,700 మంది పోలీసులను మోహరించనున్నారు. పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘థాంక్యూ పిఠాపురం’ నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. ఈ 9 నెలల పాలనలో తాను చేసిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించనున్నారు. వేదికపై పవన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది ఆశీనులవుతారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో పవన్ దాదాపు 50 నిమిషాల పాటు చేసే ప్రసంగం పైన ఆసక్తి కొనసాగుతోంది. ఈ ప్రసంగంలో ఆయన జనసేన పార్టీ భవిష్యత్ ప్రణాళికను వివరించే అవకాశం ఉంది.
2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టతనిస్తారు. కూటమి ప్రభుత్వంతో తన అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి నూతన కార్యక్రమాలు ప్రకటించే అవకాశముంది. ఆదివాసీల సంక్షేమం, యువత భవిష్యత్, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై స్పష్టతనివ్వనున్నారు. ఇది జనసేన భవిష్యత్కు కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. పవన్ ఏం చెప్పబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.