పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది.ఆ కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. గతంలో కలకత్తా హైకోర్టు రద్దు చేసిన 25,753 ఉపాధ్యాయ నియామకాలను సుప్రీం కోర్టు కూడా చెల్లనివిగా ప్రకటించింది. నియామక ప్రక్రియ పూర్తిగా అవకతవకలతో నిండిపోయిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ పోస్టులకు సంబంధించి చేపట్టిన నియామక ప్రక్రియ మలినపడిందని ధర్మాసనం ఆక్షేపించింది.ఆలోచించి ఆ నియామకాల ద్వారా కొలువులు సాధించిన దివ్యాంగులు యథావిథంగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తీర్పునిస్తున్నట్లు తెలిపింది. మూడు నెలల్లోగా కొత్త నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.
సెలక్షన్ టెస్ట్
ఈ కుంభకోణంపై గతేడాది ఏప్రిల్లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ (ఎస్ ఎల్ ఎస్ టి ) టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ క్రమంలోనే తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్లో పెట్టి తాజాగా వెలువరించింది. ఇక, ఈ కుంభకోణంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలోనే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ దీదీ సర్కారు పిటిషన్ దాఖలు చేసింది.

సెలక్షన్ పరీక్ష
ఎయిడెడ్,ప్రభుత్వ ప్రాయోజిత, పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష చేపట్టింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. కానీ, ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది.ముఖ్యంగా సీజేఐ సంజీవ్ ఖన్నా,జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం.ఈ కేసులో వాస్తవాలను పరిశీలించామని, మొత్తం ఎంపిక ప్రక్రియలో అవకతవకలు, మోసం ఉన్నాయని పేర్కొంది.