హైడ్రా ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని, ఫలితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రమంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. తెలంగాణను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేశాం. కానీ హైడ్రా ప్రాజెక్టు ప్రారంభం తర్వాత ప్రజల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి అని చెప్పుకొచ్చారు.
హైడ్రా ప్రాజెక్టు పై విమర్శలు చేస్తూ “శనివారం పొద్దున్నే వెళ్లి ఇళ్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది..? ప్రజలకు మరింత సమయం ఇచ్చి, నెమ్మదిగా చర్యలు చేపట్టవచ్చు కదా! అని మల్లారెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టు ప్రణాళికలో సరైన కార్యాచరణ లేకపోవడం వల్లే నగర అభివృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడాయని అభిప్రాయపడ్డారు. హైడ్రా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజల్లో విస్తృత నిరసనలు వ్యక్తం కావడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి వ్యాఖ్యలతో అసెంబ్లీలో చర్చ వేడెక్కింది. ప్రాజెక్టు కారణంగా సొంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్న భయం ప్రజల్లో మొదలైందని ఆయన అన్నారు. నగరానికి దిష్టి తగిలిందని అనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ తారుమారైంది. మున్ముందు దీనిపై ప్రభుత్వం గణనీయమైన నిర్ణయాలు తీసుకోవాలి ” అని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రా ప్రాజెక్టు కొనసాగించే విధానంపై సమగ్ర చర్చ జరగాలని మల్లారెడ్డి సూచించారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వారికి మద్దతుగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ను తిరిగి స్థిరపరచడం కోసం ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.