ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh), ఇటీవల బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో చెలరేగుతున్న ప్రాంతీయ విద్వేషాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే జల వివాదాలను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని మిగులు జలాలను వాడుకుంటే అభ్యంతరం ఏమిటని, బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacherla Project ) నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై నెలకొన్న ఉద్రిక్తతను మరోసారి హైలైట్ చేశాయి.
కాళేశ్వరంపై లోకేష్ సందేహాలు
సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేంటని నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించే ముందు అనుమతులు ఉన్నాయా?” అని లోకేష్ సందేహం వ్యక్తం చేశారు. దిగువ రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) ప్రాజెక్టు కడితే, ఎగువ రాష్ట్రానికి (తెలంగాణ) వచ్చిన అభ్యంతరం ఏమిటని ఆయన నిలదీశారు. తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వచ్చే నీటిని వాడుకోవడంలో తప్పేముందని, “ఏపీకి ఒక నీతి… తెలంగాణకు మరో నీతా?” అంటూ ప్రశ్నిస్తూ రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల్లో వివక్షను లోకేష్ పరోక్షంగా ఎత్తి చూపారు.
జల వనరుల వినియోగంపై స్పష్టత
మంత్రి లోకేష్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జల వనరుల వినియోగ హక్కులను స్పష్టం చేయడమే కాకుండా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణ అనుమతులపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. రాజకీయ లబ్ది కోసం కాకుండా, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పరోక్షంగా సూచించినట్లు అయ్యింది. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ పాలకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Read Also : Apple peels: యాపిల్ తొక్కలతో చర్మానికి అనేక లాభాలు