థాయిలాండ్లో జాబ్ ఆఫర్ల పేరుతో మోసపోయిన తెలుగు యువకులకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Lokesh) సత్వరంగా స్పందించారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాలు అంటూ మాయ మాటలు చెప్పిన ఏజెంట్లను నమ్మి అక్కడకు వెళ్లిన యువకులు దోపిడీకి గురవుతున్నారని ఆయన తెలిపారు. వాస్తవంగా ఉద్యోగం ఉంటుందన్న నమ్మకంతో వెళ్లిన యువతను అక్కడ బలవంతంగా పని చేయిస్తున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.
సురక్షితంగా ఇండియాకు తీసుకురావడమే లక్ష్యం
ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై, బాధితులను సురక్షితంగా ఇండియాకు తీసుకురావడానికి చర్యలు ప్రారంభించిందని లోకేశ్ వెల్లడించారు. ఈ తరహా మోసాలపై రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిఘా పెట్టిందని, ఈ సమయంలో బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాయబారి కార్యాలయాల ద్వారా బాధితులను గుర్తించి తరలించే పనిలో ఉన్నామని తెలిపారు.
వెరిఫికేషన్ అవసరం – అందుబాటులో హెల్ప్లైన్ నంబర్లు
ఈ తరహా మోసాలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన లోకేశ్, ఏదైనా విదేశీ జాబ్ ఆఫర్ వస్తే ముందుగా దానిని ధృవీకరించుకోవాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేకంగా రెండు నంబర్లు ఏర్పాటు చేసింది. వెరిఫికేషన్ కోసం +91-863-2340678 కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ ద్వారా 8500027678 నంబర్కు మెసేజ్ చేయవచ్చని తెలిపారు. ఈ హెల్ప్లైన్ ద్వారా యువతకు పూర్తి సమాచారం, సలహాలు అందిస్తామని పేర్కొన్నారు.
Read Also : Pawan Kalyan : జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన మాధవ్