తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం ప్రధాన నడక మార్గం అయిన అలిపిరి మెట్ల దారి మళ్లీ చిరుతల సంచారంతో వార్తల్లో నిలిచింది. గతంలోనూ ఇదే మార్గంలో చిరుతలు కనిపించి భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. రెండేళ్ల క్రితం ఓ ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపేసిన ఘటన తర్వాత తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోసారి చిరుత కలకలం
తాజాగా, అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గాలి గోపురం వద్ద చిరుత దర్శనమిచ్చింది. అది ఓ పిల్లిని వేటాడి అడవిలోకి తీసుకెళ్లింది. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ చిరుత కేవలం మెట్ల మార్గంలోనే కాకుండా, తిరుపతి జూ పార్క్ రోడ్డులో కూడా గత రాత్రి కనిపించినట్టు సమాచారం. చిరుతలు తిరుమల నడక మార్గంలో సంచరిస్తుండటంతో భక్తులు భయంతో ఉన్నారు. కాలినడక మార్గం భద్రతపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి రాత్రి వేళల్లో భక్తులు చిరుత భయంతో నడక మార్గంలో వెళ్లాలా వద్దా అనే విషయాన్ని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీటీడీ అప్రమత్తం – భద్రతా చర్యలు
చిరుత సంచారాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు భద్రతను మరింత కఠినతరం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత భక్తులను నడక మార్గాల్లో అనుమతించడం లేదు. 12 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల లోపే నడక మార్గంలో అనుమతిస్తున్నారు. చిరుతల కదలికలపై నిఘా పెట్టేందుకు అడవీ శాఖతో కలిసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మెట్ల మార్గంలో మరిన్ని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ పెంచాలని ప్రతిపాదనలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, అటవీ ప్రాంతాల తగ్గింపు చిరుతల అభయారణ్యాలను తగ్గించింది. అడవుల్లోని ఆహారం కొరత, వేట భయంతో చిరుతలు పట్టణాల వైపు వచ్చేస్తున్నాయి. తిరుమల అడవి ప్రాంతంలో చిరుతల సంఖ్య పెరిగినట్టు అటవీ శాఖ అంచనా వేస్తోంది.
భక్తుల భద్రత కోసం సూచనలు
చిరుతలు ఎక్కువగా రాత్రి, తెల్లవారుజామున సంచరించే అవకాశం ఉంటుంది.చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా నడక మార్గంలో వెళ్లకుండా ఉండాలి. భక్తులు పెద్ద గుంపులుగా నడవాలి, ఒంటరిగా ప్రయాణించకూడదు. అనుమతించని సమయాల్లో నడక మార్గంలోకి వెళ్లకూడదు. చిరుత కనపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. మెట్ల మార్గంలో మరింత కంచె ఏర్పాటు చేయాలి. చిరుతల కదలికలను ట్రాక్ చేసే టెక్నాలజీ వినియోగించాలి. చిరుతల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి వాటిని పట్టి అడవులకు తరలించాలి. తిరుమల అడవుల్లో చిరుతల జనాభా పెరిగిందని అంచనా వేసి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. టీటీడీ అధికారులు భక్తులను అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడచుకోవడం ఎంతో అవసరం. తిరుమల వెళ్లే భక్తులకు ఇది ఒక హెచ్చరిక మాత్రమే, భద్రతా చర్యలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు.