తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ తనను రూ.1.20 కోట్ల మేర మోసం చేశాడని, డబ్బు ఇవ్వకుండా పిల్లలను చంపేస్తానని బెదిరిస్తున్నాడని లక్ష్మి అనే మహిళ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. మరోవైపు సదరు మహిళతో కిరణ్ రాయల్ ప్రైవేటు వీడియోలు కూడా సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. కిరణ్ రాయల్ ను జనసేన పార్టీ హైకమాండ్ తాత్కాలికంగా పార్టీకి దూరంగా ఉంచింది. నేడు అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ముగించుకుని వస్తున్న లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆన్ లైన్ చీటింగ్ కేసులో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

లక్ష్మిరెడ్డిని రాజస్ధాన్కు చెందిన జైపూర్ పోలీసులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ రాయల్పై విమర్శలు చేసి తిరిగి వెళ్తున్న లక్ష్మిరెడ్డిని రాజస్ధాన్ నుంచి వచ్చిన మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.లక్ష్మిరెడ్డిని తిరుపతి ఎస్వీయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్ధానిక పోలీసులకు సమాచారం అందించిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్తో జైపూర్కు తరలించనున్నారు. ఆన్లైన్ గేమ్స్లో చీటింగ్ చేయడంతో లక్ష్మిరెడ్డిని రాజస్ధాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీసీ 173 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.ఆన్ లైన్ చీటింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న లక్ష్మి తప్పించుకుని తిరుగుతున్నట్టు సమాచారం. పోలీసుల ప్రకారం, లక్ష్మి చేసిన ఆరోపణల్లో చాలావరకు నిరాధారమైనవిగా తేలాయి. కిరణ్ రాయల్ ఫిర్యాదు మేరకు పోలీసులు లక్ష్మిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో లక్ష్మి ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోవడంతో ఆమెను తప్పుడు ఆరోపణలు, కిరణ్ రాయల్ పరువు నష్టం వంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఆమె మీడియాలో కనిపిస్తూ ఉండడంతో రాజస్థాన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను తిరుపతిలో అరెస్ట్ చేసి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించి మరోసారి కిరణ్ రాయల్ పై ధ్వజమెత్తింది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని… తనకు ఎవరూ తెలియదని చెప్పింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్ తన పరిస్థితి పట్ల స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరింది.