బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగమంతా కాంగ్రెస్ పార్టీని దూషించే ధోరణిలో సాగిందని ఆయన విమర్శించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ బహుశా చక్కని సూచనలు చేస్తారని భావించాం. కానీ ఆయన మనసంతా ద్వేషంతో నిండి ఉన్నట్టు కనిపించింది” అని అన్నారు.
ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన కేసీఆర్
పొంగులేటి కేసీఆర్పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేసినది కేసీఆరే,” అని ఆరోపించారు. భారీ అప్పులు చేసిన కారణంగా రాష్ట్ర అభివృద్ధి మందగించిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను తానేదో నెరవేరుస్తున్నట్లు మాయచూపులు చూపించి, వాస్తవానికి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభానికి గురిచేసిన బాధ్యత పూర్తిగా కేసీఆర్దేనని మండిపడ్డారు.
కాంగ్రెస్ను విలన్గా చూపించడమే లక్ష్యమా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను మరిచి, ఇప్పుడు వారికి విలన్ వేషం వేసేందుకు కేసీఆర్ ప్రయత్నించడాన్ని పొంగులేటి ఖండించారు. “తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విలనా?” అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది జీవితాలు అర్పించారనీ, ఇప్పుడు వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ వక్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.
Read Also : Congress : కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం కీలక పిలుపు