పీరియాడికల్ డ్రామాతో ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ గ్రాండ్ లాంచ్!
రీసెంట్గానే ‘అనగనగా’ సినిమాతో ఆకట్టుకున్న కాజల్ చౌదరి హీరోయిన్గా, యువ హీరో కార్తిక్ రాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ శుక్రవారం (మే 23)న ఘనంగా ప్రారంభమైంది. శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్పై గాలి కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా రాజా దుస్సా వ్యవహరిస్తుండగా, మల్లవరం వేంకటేశ్వర రెడ్డి మరియు రూప కిరణ్ గంజి ఈ చిత్రానికి సహనిర్మాతలుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కార్తికేయ శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాగా, లైన్ ప్రొడ్యూసర్గా కీసరి నరసింహ (KNR) పనిచేస్తున్నారు. ఇతర సాంకేతిక నిపుణులలో ఆర్ట్ డైరెక్టర్గా రవి కుమార్ గుర్రం, కెమెరామెన్గా గంగానమోని శేఖర్, సంగీత దర్శకుడిగా సురేష్ బొబ్బలి, గీత రచయితగా కాసర్ల శ్యామ్ ఉన్నారు.

రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు – టాలీవుడ్ ప్రముఖుల హాజరు
హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరగగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య వంటి ప్రముఖులు ఈ వేడుకలో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ను దర్శకుడికి అందించగా, ముహూర్తపు షాట్కు సురేష్ బాబు క్లాప్ కొట్టారు. కెమెరా స్విచ్ ఆన్ చేసినది హీరో చైతన్య కాగా, మొదటి సన్నివేశానికి దర్శకత్వం వహించినది భీమనేని శ్రీనివాసరావు.
దర్శకుడు రాజా దుస్సా మాటల్లో – 1980ల వరంగల్ నేపథ్యంలో రూపొందే చిత్ర కథ
అనంతరం దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ.. ‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యంతో పాటు ఎమోషనల్గానూ ఈ చిత్రం ఉంటుంది. 1980 లో వరంగల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కార్తిక్ రాజు, కాజల్ చౌదరితో ఈ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మా నిర్మాత గాలి కృష్ణ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా కోసం వచ్చిన సురేష్ బాబు గారు, తమ్మారెడ్డి గారు, భీమనేని శ్రీనివాసరావు గారు, క్రాంతి మాధవ్ గారు, చైతన్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని వివరించారు. ఇదివరకు దర్శకుడు రాజా దుస్సా హన్సికతో ‘105 మినిట్స్’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
నటీనటుల స్పందన – తమ పాత్రలపై ఆనందం వ్యక్తం చేసిన హీరో, హీరోయిన్
హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. ‘80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. కాజల్ చౌదరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి కథను నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజా దుస్సా, నిర్మాత గాలి కృష్ణ గారికి థాంక్స్. మున్ముందు మా సినిమా నుంచి మరిన్ని అప్డేట్లు వస్తాయి” అని అన్నారు.
కాజల్ చౌదరి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కథ వినగానే నన్ను వెంటనే ఆకట్టుకుంది. ఇది యూనిక్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సినిమా. మంచి టీమ్తో కలిసి పని చేయడం గొప్ప అనుభూతి. తెలుగు ప్రేక్షకుల ప్రేమకి నేను కృతజ్ఞురాలిని. ఈ సినిమాతో కూడా నన్ను ప్రేమించాలని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.
టెక్నికల్ టీమ్, నటీనటుల జాబితా – సమిష్టిగా శ్రమిస్తున్న బృందం
ఈ సినిమాలో కార్తిక్ రాజు, కాజల్ చౌదరి కాకుండా, సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతీ, శ్రీధర్ రెడ్డి, అభయ్, ఫణి, పద్మ, కీర్తిలత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కాసర్ల శ్యామ్ సింగిల్ కార్డ్ గీత రచయితగా పని చేస్తున్నారు.
Read also: Kankhajura: మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే ‘కాన్ ఖజురా’ సిరీస్..