దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై బీజేపీ మరింత ఫోకస్ పెంచింది.వన్ నేషన్ వన్ ఎలక్షన్ (ఒకే దేశం – ఒకే ఎన్నిక) ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు పార్టీ ఎంపీలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు.
ప్రత్యేక కార్యక్రమాలు
జమిలి ఎన్నికలపై పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. వాటిని అమలు చేసేందుకు బీజేపీ ఎంపీలను ఇన్ఛార్జ్లుగా నియమించారు. అలాగే జమిలి ఎన్నికలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీలకు సూచించారాయన. దేశమంతటా ఒకేసారి లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదన్నారు.ఒకే దేశం ఒకే ఎన్నికతో ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్
. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. మరోవైపు ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం హామీలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల్ గ్యాస్, పీఎం కిసాన్, బేటీ బచావో, బేటీ పడావో, జీవన్ జ్యోతి, సురక్ష బీమా లాంటి పథకాలను కూడా ప్రజల్లోకి ఎంపీలు తీసుకెళ్లాలన్నారు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో ఆఫీస్ బేరర్లు, జిల్లా అధ్యక్షులతో భేటీ ఆయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ, వన్ నేషన్ వన్ ఎలక్షన్, అటల్ జీ శతజయంతి ఉత్సవాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని.. ప్రజా పోరాటాలు చేయాలని నేతలకు సూచించారు కిషన్ రెడ్డి.
జమిలి ఎన్నికలు
జమిలి ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా లోక్సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. ప్రస్తుత వ్యవస్థలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలు వేర్వేరు కాలాల్లో జరుగుతాయి. అయితే జమిలి ఎన్నికల ద్వారా ప్రతి ఐదేళ్లకోసారి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ యోచన చేసింది.ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి ఇప్పటికే లా కమిషన్ తీసుకున్న ప్రతిపాదనలు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో వేసిన ఉన్నతస్థాయి కమిటీ సమర్పించిన రిపోర్ట్ సహా అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.