ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించిన జగన్, ప్రజలతో మమేకమవడానికి, వైఎస్సార్సీపీ బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందనే విశ్వాసంతో, జగన్ తన రాజకీయ ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ క్యాడర్ను చురుగ్గా మళ్లీ సమీకరించేందుకు ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కూటమిపై వ్యతిరేకత
2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీ క్యాడర్లో నిరాశ చోటుచేసుకున్నప్పటికీ, జగన్ మళ్లీ బలంగా పార్టీని నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ హామీలు అమలు చేయడంలో విఫలమవుతోందని, ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్ పలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, ప్రజల సమస్యలు వినే కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన జగన్, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. జిల్లాల పర్యటన ద్వారా ప్రజలను కలుస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేలా వ్యూహం రచిస్తున్నారు. ఉగాది తర్వాత తన జిల్లాల పర్యటన ప్రారంభమవుతుందని ప్రకటించిన జగన్, ముందుగా పల్నాడు జిల్లాను తన ప్రధాన కేంద్రంగా చేసుకుని ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు.
పల్నాడు కేంద్రంగా కీలక నిర్ణయాలు
పల్నాడు జిల్లా రాజకీయంగా ఎప్పుడూ సంచలనాలకు కేంద్రమై ఉంటుందనే విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, 2024లో పూర్తి పరాజయం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో జగన్ ఇప్పుడే అక్కడ మళ్లీ పునరాగమనానికి నాంది పలికేలా పలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా, గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు జగన్ను కలవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మైనారిటీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన దాదాపు 400 కుటుంబాలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ బహిష్కరణ విధించినట్లు ఆ గ్రామస్తులు జగన్కు వివరించారు. ఈ సమస్యపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోందని, తమకు అండగా పార్టీ నిలవాలని కోరారు. జగన్ దీనిపై తీవ్రంగా స్పందించి, పార్టీ బాధిత కుటుంబాలకు పూర్తి మద్దతునిస్తూ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ ఒంటరిగా లేరు అంటూ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఛలో పిన్నెల్లి – జగన్ నూతన ఉద్యమం
జగన్ స్వయంగా బాధితులతో కలిసి గ్రామ ప్రవేశం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా త్వరలో “ఛలో పిన్నెల్లి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. పార్టీ శ్రేణులతో పాటు, బాధిత కుటుంబాలతో కలిసి పిన్నెల్లి గ్రామంలోకి వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. పల్నాడు ప్రాంతంతో పాటు తురకపాలెం, మాదెనపాడు, చెన్నాయపాలెం గ్రామాల్లోనూ జగన్ పర్యటనలు నిర్వహించనున్నారు. ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. రాజకీయంగా కీలకంగా మారిన ఈ నిర్ణయంతో పల్నాడు మరోసారి రాజకీయ వేడి పెరుగనుంది. జగన్ జిల్లాల పర్యటన పైన వచ్చే వారం కీలక ప్రకటనకు కసరత్తు జరుగుతోంది.