టిబెట్(Tibet)కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా(Dalai lama)(90) తన మరణం తర్వాత తనకు వారసుడు ఉంటాడని బుధవారం ఒక వీడియో సందేశంలో చెప్పారు. తన వారసుడిని గుర్తించే ప్రక్రియ పూర్తిగా గాడెన్ ఫోడ్రాంగ్ ఫౌండేషన్ చూసుకుంటుందని, “ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు మరెవరికీ లేదని” ఆయన అన్నారు. అంతేకాదు, తన వారసత్వం కొనసాగాలని 14 ఏళ్లుగా టిబెట్, మంగోలియా, రష్యా, హిమాలయ(Tibet, Mongolia, Russia, Himalaya) ప్రాంతం, చైనాలోని బౌద్ధ మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని ప్రస్తుత దలైలామా చెప్పారు. టిబెటన్ బుద్ధిజం విశ్వాసాల ప్రకారం, దలైలామాలు మరణం తర్వాత మరొక శరీరంలో ‘పునర్జన్మ’ పొందుతారు. చైనా(China) సొంతంగా దలైలామాను ఎంపిక చేయవచ్చనే ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. దీనిక ప్రతిస్పందిస్తూ, ‘దలైలామా పునర్జన్మ’ను చైనాలోనే గుర్తించాలని, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో అని చైనా పేర్కొంది.
1951లో టిబెట్ను చైనా స్వాధీనం చేసుకుంది, దలైలామాను వేర్పాటువాదిగా చూస్తోంది.
దలైలామాను అవలోకితేశ్వర (చెన్రెజిగ్- కరుణామయుడైన బుద్ధుడు) అవతారంగా భావిస్తారు.హిందువులు, జైనుల మాదిరిగానే, బౌద్ధులు కూడా పునర్జన్మను విశ్వసిస్తారు.
టిబెటన్ బౌద్ధమత విశ్వాసాల ప్రకారం.. గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉన్న వ్యక్తులు ఎప్పుడు, ఎక్కడ పునర్జన్మ పొందాలో ఎంచుకుంటారు.

ప్రస్తుత దలైలామా 1935 జూలై 6న ఈశాన్య టిబెట్లోని ఒక పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు లామో ధోండుబ్. రెండు సంవత్సరాల వయస్సులోనే లామోను 13వ దలైలామా పునర్జమ్మగా గుర్తించారు. “ఒకే ఆత్మ మళ్లీ మళ్లీ పుడుతుందని టిబెటన్లు విశ్వసిస్తారు” అని 1985 నుంచి దలైలామాకు అనువాదకుడిగా ఉన్న డాక్టర్ తుప్టెన్ జిన్పా అన్నారు.
బౌద్ధమతానికి 2,500 సంవత్సరాల చరిత్ర
బౌద్ధమతానికి 2,500 సంవత్సరాల చరిత్ర ఉంది, కానీ దలైలామా వ్యవస్థ ఆ తర్వాతే పుట్టింది. ‘మొదటి దలైలామా 1391లో జన్మించిన గెడున్ డ్రప్’ అని అబెర్డీన్ యూనివర్సిటీలో స్కాటిష్ సెంటర్ ఫర్ హిమాలయన్ రీసర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మార్టిన్ ఎ మిల్స్ అన్నారు. కానీ, ఈ బౌద్ధ గురువు పునర్జమ్మ భావన అంతకు 300 ఏళ్ల ముందు నుంచే ఉందని మార్టిన్ చెప్పారు.
దలైలామాను ఎలా ఎంపిక చేస్తారు?
‘దలైలామా ఎంపిక చాలా సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రక్రియ’ అని డాక్టర్ తుప్టెన్ జిన్పా అంటున్నారు. దీనికి సంవత్సరాలు పట్టవచ్చు. 14వ దలైలామాను కనుగొనడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. దలైలామా మరణించిన తర్వాత, ఉన్నత స్థాయి సన్యాసులు అదే సమయంలో జన్మించిన బాలుడి కోసం వెతుకుతారు. దీనికోసం వారు కొన్ని సంకేతాలు, ఆధారాలను ఉపయోగిస్తారు.
చైనా జోక్యం ఎందుకు?
1950లో చైనా వేల మంది సైనికులను టిబెట్లోకి పంపి ఆ ప్రాంతంపై నియంత్రణను ప్రారంభించింది. 1959లో టిబెటన్లు చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు, ఆ తర్వాత దలైలామా భారత్కు పారిపోయి ప్రవాస ప్రభుత్వాన్ని ప్రారంభించారు.టిబెట్ ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత నుంచి దలైలామా వైదొలిగినప్పటికీ, చాలామంది ఇప్పటికీ ఆయనను చైనా పాలనకు వ్యతిరేక చిహ్నంగానే చూస్తున్నారు.ఈసారి తన పునర్జమ్మ టిబెట్ వెలుపల ఉండవచ్చని దలైలామా గతంలో చెప్పారు.కాగా, దలైలామా రాజకీయ బహిష్కరణకు గురైన వ్యక్తి అని, మతాన్ని ఉపయోగించి దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని చైనా ఆరోపించింది.
చైనా జోక్యంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు
టిబెట్ వ్యవహారాల్లో చైనా జోక్యంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేశాయి.”టిబెట్ మతపరమైన ఆచారాలలో రాజకీయ జోక్యాన్ని చైనా అధికారులు వెంటనే ఆపివేయాలి. మతపరమైన వారసత్వాన్ని నియంత్రణకు ఒక సాధనంగా ఉపయోగించవద్దు” అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా డైరెక్టర్ సారా బ్రూక్స్ ఒక ప్రకటనలో తెలిపారు. దలైలామా భారత్లో ఎందుకు ఉంటున్నారు?
1959లో దలైలామా యువకుడిగా ఉన్న సమయంలో టిబెట్ నుంచి తప్పించుకుని వచ్చి భారత్లో నివసిస్తున్నారు. 1959 మార్చి 10న, ఒక చైనా జనరల్ దలైలామాను నృత్య ప్రదర్శనకు ఆహ్వానించారు. కానీ, ఇది ఆయనను కిడ్నాప్ చేయడానికి కుట్రగా చాలా మంది టిబెటన్లు భయపడ్డారు. దీంతో, వారంతా దలైలామా ప్యాలెస్ చుట్టూ చేరి, ఆయనకు రక్షణగా నిలిచారు.కొన్ని రోజుల తరువాత, దలైలామా సైనికుడి దుస్తులు ధరించి, వేలాది మంది అనుచరులతో కలిసి రాత్రి నిశ్శబ్దంగా బయలుదేరారు. హిమాలయాల మీదుగా 15 రోజుల ప్రయాణం తర్వాత, ఆయన భారత సరిహద్దుకు చేరుకున్నారు. మార్చి 1959లో భారత దేశానికి చేరిన దలైలామాను, ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వాగతించారు. దలైలామా మాదిరే పంచెన్ లామాను కూడా బుద్ధుని అంశగా భావిస్తుంటారు. ఆయనను అమితాభ (అనంతమైన కాంతి కలిగిన బుద్ధుడు) పునర్జన్మగా విశ్వసిస్తారు. ఈయన టిబెట్ బౌద్ధ మతంలో రెండవ అతి ముఖ్యమైన వ్యక్తి. టిబెట్ సంప్రదాయం ప్రకారం, దలైలామా, పంచెన్ లామా ఒకరినొకరు మార్గనిర్దేశం చేసుకుంటారు, తదుపరి పునర్జన్మను కనుగొనడంలో సహాయపడతారు.
Read Also: Dalai Lama : వారసుడి ఎంపిక ప్రక్రియ దలైలామా చేతుల్లోనే ఉంది : భారత్