అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘర్షణల పరిష్కారంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు ఆపడంలో తాను నిపుణుడిని అని చెప్పుకున్నారు. రెండు సంవత్సరాలుగా కొనసాగిన గాజా యుద్ధం తాజాగా ముగిసిందని ప్రకటించిన ఆయన.. ఇజ్రాయెల్-హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో తన మధ్యవర్తిత్వమే కీలకమని పేర్కొన్నారు. ట్రంప్ ఇజ్రాయెల్కు బయలుదేరి వెళ్తున్న సందర్భంలో.. ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు చేశారు. తన హయాంలో ప్రపంచంలో నెలకొన్న అనేక వివాదాలను పరిష్కరించానని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటి వరకు ఏడు యుద్ధాలను ఆపిన తాను.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఆపేందుకు కూడా తీవ్రంగా కృషి చేశానన్నారు.
Read Also: Trump: బాబోయ్ పెళ్లి వద్దు: H-1B వీసా దెబ్బకు విలవిల

తనకు ఎవరూ సాటి రారు: ట్రంప్
యుద్ధాలను కేవలం దౌత్య మార్గాల ద్వారానే కాకుండా ఆర్థిక విధానాలతోనూ పరిష్కరించగలనని తాను రుజువు చేసినట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగానే ఆయన భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణను ప్రస్తావించారు. తాను కేవలం సుంకాల బెదిరింపుల ఆధారంగా కొన్ని యుద్ధాలను పరిష్కరించానని చెప్పుకొచ్చారు. అందులో భారత్-పాకిస్థాన్ ఒకటని పేర్కొన్నారు. ఒకవేళ మీరు యుద్ధం చేయాలనుకుంటే.. మీ ఇద్దరిపై 100, 150, 200 శాతం వరకు భారీ సుంకాలు విధిస్తానని పాకిస్థాన్, భారత దేశాలను హెచ్చరించానని గుర్తు చేశారు.
అవార్డుల కోసం ప్రయత్నం కాదు
ముఖ్యంగా ఇజ్రాయెల్ వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. నేను ఇప్పుడు పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నానని అన్నారు. తాను తిరిగి అమెరికాకు వచ్చేవరకు అది ఆగాల్సిందేనని చెప్పారు. ఎందుకంటే తాను యుద్ధాలను ఆపడంలో నిపుణుడిని అని ప్రకటించారు. చాలా సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధాలను కూడా తాను ఒక రోజులోనే పరిష్కరించానని.. ఈ ప్రయత్నం ద్వారా తాను లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని వివరించారు. నోబెల్ శాంతి బహుమతి గురించి ప్రస్తావించగా.. తాను ఈ ప్రయత్నాలన్నీ అవార్డుల కోసం చేయడం లేదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: