గడచిన కొన్ని రోజుల గురించి ఆలోచిస్తే షోనా బను(Sohnna Banu) ఇప్పటికీ వణికిపోతున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం(Assam)లోని బార్పేట్(Barpet) జిల్లాకు చెందిన షోనా బను వయసు 58 ఏళ్లు. మే 25న తనను స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిచారని, తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లారని షోనా బను తెలిపారు. అక్కడినుంచి ఆమెను, దాదాపుగా మరో 13 మందిని బలవంతంగా బంగ్లాదేశ్ దాటించారని ఆమె తెలిపారు.
తనను ఎందుకు పంపించారో చెప్పలేదని, తాను జీవిస్తున్న అస్సాంలో కొన్నేళ్లగా పరిస్థితులు మారిపోయాయని ఆమె చెప్పారు. తాను అక్రమంగా వలస వచ్చిన వ్యక్తిని కాదని, భారతీయ పౌరురాలేనని నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని షోనా బను ఆవేదన వ్యక్తంచేశారు. ఆ పరిస్థితి భయాందోళనకు గురి చేస్తోందని ఆమె అన్నారు.

నీళ్లు లేకుండా రెండురోజులపాటు ఉన్నా
”తుపాకీ పెట్టి బెదిరించి వాళ్లు నన్ను తీసుకెళ్లారు. ఓ పొలం మధ్యలో మోకాలి లోతు నీటిలో దోమలు, జలగల మధ్య ఆహారం, నీళ్లు లేకుండా రెండురోజులపాటు ఉన్నా. భారత్, బంగ్లాదేశ్ మధ్య మనుషులెవరూ లేని ఆ ప్రాంతంలో రెండు రోజులున్న తర్వాత బంగ్లాదేశ్ వైపున్న ఒక పాత జైలులాంటి దానికి నన్ను తీసుకెళ్లారు” అని ఆమె చెప్పారు.
‘ఎందుకు పంపారు..తిరిగి ఎందుకు తీసుకొచ్చారు’
ఆ పాత జైలులాంటి దానిలో రెండురోజులున్న తరువాత ఆమెతో పాటు మరికొందరిని బంగ్లాదేశ్ అధికారులు సరిహద్దుల దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ భారత అధికారులు ఉన్నారని, వారు తమను ఇళ్లకు పంపించారని షోనా బను తెలిపారు. అప్పుడు తనతోపాటు ఉన్నవారంతా కొన్నిరోజుల క్రితం తనతో పాటు వచ్చినవారేనా కాదా అనేది తనకు స్పష్టంగా తెలియదని ఆమె చెప్పారు.
బనును బలంతంగా బంగ్లాదేశ్ ఎందుకు పంపించారో, తిరిగి ఎందుకు వెనక్కి తీసుకొచ్చారో తెలియదు. అయితే గతంలో ‘అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినవారు’ అనే అనుమానంతో ట్రిబ్యునల్స్ విదేశీయులుగా ప్రకటించిన వారిని అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్న ఘటనలు అస్సాంలో ఇటీవల జరుగుతున్నాయి. వాటిలో బను కేసు ఒకటి.
పొడవైన సరిహద్దు
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవడం భారత్లో కొత్త కాదు. రెండు దేశాల మధ్య 4,906కిలోమీటర్ల పొడవైన సున్నితమైన సరిహద్దు ఉంది. దీంతో భారీ భద్రత ఉన్నప్పటికీ సరిహద్దులు దాటడం సాపేక్షికంగా తేలికైన విషయంగా మారింది.
అయితే ఇళ్లల్లో ఉన్న ప్రజలను తీసుకొచ్చి , ఎలాంటి విధానపరమైన ప్రక్రియ లేకుండా బలవంతంగా మరో దేశం పంపించడం చాలా అరుదని, ఈ కేసుల్లో వాదించే లాయర్లు చెబుతున్నారు. కానీ ఇటువంటి ప్రయత్నాలు గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతున్నాయి.
తాజాగా ఇలా ఎంతమందిని సరిహద్దులు దాటించారనే విషయమై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించడం లేదు. కానీ ఒక్క అస్సాం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మే లోనే 12వందలమందికి పైగా ప్రజలను భారత్ అక్రమంగా బంగ్లాదేశ్లోకి పంపించిందని అక్కడి ఉన్నతస్థాయి అధికారయంత్రాంగం ఆరోపిస్తోంది.
Read Also: Gaza: గాజాలో పార్లే-జీ బిస్కట్ ప్యాకెట్ ధర రూ.2300 పైమాటే!