పహల్గామ్ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం స్పందనగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతంగా పూర్తయ్యింది. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు జరిపాయి. దీని ప్రభావం పాక్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్లపై(High alert in Punjab, Rajasthan) పడింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు హై అలర్ట్ పరిస్థితులు ఏర్పడ్డాయి. సరిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీ చేశారు.

రాజస్థాన్లో అప్రమత్తత
పాకిస్థాన్తో రాజస్థాన్ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంది. ఫైటర్ జెట్స్ ప్రొటోకాల్ నేపథ్యంలో జోధ్పూర్, కిషన్గఢ్, బికనీర్లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు. సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థతో పాటు క్షిపణి రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. గంగానగర్ నుంచి రాణా ఆఫ్ కచ్ వరకు సుఖోయ్-30 ఎంకేఐ జెట్లు ఎయిర్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
సైనిక చర్యలతో పాటు విద్యా, రవాణా రంగాలపై ప్రభావం
ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బర్మేర్ జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది సెలవులు రద్దు చేశారు. అలాగే సరిహద్దు గ్రామాలు హై అలర్ట్లో ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైసల్మేర్, జోధ్పూర్లో అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పూర్తిగా లైట్లను ఆర్పివేయాలని ప్రకటించారు. దీనివల్ల శత్రుదేశం వైమానిక దాడులు చేయడానికి కష్టమవుతుంది.
పంజాబ్లో భద్రతా చర్యలు
పంజాబ్(Punjab) రాష్ట్రం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. పోలీసుల సెలవులు రద్దు, బహిరంగ సభలపై ఆంక్షలు, ప్రజల గుమికూడడాన్ని నిషేధించడం వంటి చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది పంజాబ్లో 2016 ఉరి దాడుల తర్వాత తీసుకున్న అత్యంత గంభీర భద్రతా చర్యలుగా భావించవచ్చు. కాగా, బుధవారం భారత బలగాలు నిర్వహించిన క్షిపణి దాడులను ‘బాధ్యతాయుత దాడులు’గా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. “ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం, ఇండియాకు పంపబడే ఉగ్రవాదులను నిర్వీర్యం చేయడంపైనే మేము దృష్టి సారించాం” అని ఆయన అన్నారు. అయితే, భారత క్షిపణి దాడులను ‘యుద్ధ చర్య’గా అభివర్ణించిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘తగిన సమాధానం’ ఇచ్చే హక్కు తమ దేశానికి ఉందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైనా, దాని దుష్పరిణామాలపై పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Read also: Operation Sindoor: పాక్ సరిహద్దు గ్రామాల ప్రజల ఆవేదన అంతా ఇంతా కాదు