పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత ప్రభుత్వం తీసుకున్న కీలక వ్యూహాత్మక చర్యగా ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) మరియు పాకిస్తాన్లోని తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, అత్యంత ఖచ్చితంగా మెరుపుదాడులు నిర్వహించింది.

కేవలం ఉగ్ర స్థావరాలే
భారత సైన్యం చాలా స్పష్టమైన వ్యూహంతో ఈ దాడులను చేపట్టింది. దాడుల్లో పాక్ మిలటరీ స్థావరాలు గానీ, సాధారణ పౌర ప్రాంతాలు గానీ లక్ష్యం కాకుండా, కేవలం ఉగ్రవాద సంస్థల శిబిరాలే ధ్వంసం చేయబడ్డాయి. సైనిక వర్గాల ప్రకారం, ఇదొక నిర్దిష్టమైన వ్యూహం. ఎందుకంటే పాక్ సైనిక స్థావరాలపై దాడి చేస్తే అది యుద్ధానికి దారితీయవచ్చని, భారత్ అసలు ఉద్దేశం మాత్రం ప్రతీకారాన్ని చూపించడం కాదు, భద్రతను పరిరక్షించడమే అని వారు స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ మొత్తం భారత సరిహద్దుల నుంచే నిర్వహించినట్లు తెలిపాయి.
భారత గగనతల నుంచే దాడులు
ఈ ఆపరేషన్లో భారత్ తన సరిహద్దుల నుంచే దాడులను నిర్వహించింది. భారత గగనతలానికి బయటకు వెళ్లకుండా, అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సరిగ్గా ఛేదించగల సాంకేతికతను భారత సైన్యం వినియోగించింది. ఇందుకోసం రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు స్కాల్ఫ్ క్రూయిజ్ మిసైల్స్, ఖచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులు, మరియు హరోప్ కామికేజ్ డ్రోన్ల వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటితో ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నేలమట్టం చేసినట్లు వివరించాయి. ఇది భారతదేశం యొక్క ఉద్దేశపూర్వక, నియంత్రిత సైనిక వ్యూహాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ తీసుకున్న ఈ దాడులపై అనేక పాశ్చాత్య దేశాలు మౌనంగా మద్దతు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్, ఉగ్రవాదంపై తన గట్టి స్థానం చూపించింది. రాజకీయంగా కాకుండా రక్షణ రంగంలో స్వతంత్రంగా తీసుకున్న ఈ నిర్ణయం, భారతదేశ భద్రతా వ్యవస్థ బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
Read also: Operation Sindoor: ‘భారత్కు అండగా నిలబడాలి’- యూకే ఎంపీ ప్రీతి పటేల్