భారత్-పాకిస్థాన్ యుద్దం నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల ఆందోళనలు, ప్రసారకర్తలు, స్పాన్సర్స్, అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు.వారం రోజుల తర్వాత పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి తదుపరి షెడ్యూల్, మ్యాచ్ల వివరాలను వెల్లడిస్తామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. భారత సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, ఐపీఎల్ వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. దేశం కంటే క్రికెట్ ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఈ సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లతో పాటు ఫైనల్తో సహా నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడించాల్సి ఉంది. సజావుగా సాగుతున్న టోర్నీ అనూహ్య పరిస్థితుల్లో వాయిదా పడింది.బీసీసీఐ రాబోయే రోజుల్లో తాజా షెడ్యూల్, వేదికలపై సమాచారం ప్రకటించనుంది.
నేపథ్యం
ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడటంతో ఇతర దేశాల క్రికెట్ బోర్డులు బీసీసీఐ అండగా నిలుస్తూ తమ దేశంలో లీగ్ను పూర్తి చేయాలని కోరుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత్-పాక్ యుద్దం నేపథ్యంతో ఇంగ్లండ్ వేదికగా ఐపీఎల్ 2025 సీజన్ను పూర్తి చేయాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు తాము చేస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ (Michael Vaughan)మైకేల్ వాఘన్ ఐపీఎల్ను ఇంగ్లండ్లో పూర్తి చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ‘యూకేలో ఐపీఎల్ 2025 సీజన్ను పూర్తి చేయండి. అన్ని వేదికలు సిద్దంగా ఉన్నాయి. భారత ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం ఇక్కడే ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి.’అని మైకేల్ వాఘన్ ట్వీట్ చేశాడు. జూన్లో భారత్ ఐదు టెస్ట్ల సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటించనుంది. ఈ పర్యటనతోనే డబ్ల్యూటీసీ 2025-27 ప్రారంభం కానుంది.

భయంలో విదేశీ ఆటగాళ్లు
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్తామని బీసీసీఐకి(BCCI) చెప్పినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లందరూ భయాందోళనకు గురవ్వడంతో పాటు,మ్యాచ్ల నిర్వహణ, ప్రేక్షకుల భద్రత సవాల్గా మారడంతోనే బీసీసీఐ టోర్నీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇలా ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా వేయడం రెండోసారి. గతంలో కరోన కారణంగా ఐపీఎల్ను మధ్యలోనే వాయిదా వేసారు. పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత తిరిగిన ప్రారంభించారు.
Read Also: Sports: టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికి రోహిత్ మంచి పని చేసాడు: సంజయ్ మంజ్రేకర్