భారత్(Bharath)ను పాకిస్థాన్(Pakistan) అస్థిత్వ ముప్పుగా పరిగణిస్తోందని అమెరికా రక్షణ(America Defence) నిఘా సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తన అణ్వాయుధాగారాన్ని ఆధునీకరించుకుంటోందని వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీనిని అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసింది.
భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధి
భారత్ను పాకిస్థాన్ అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తోందని నివేదికలో పేర్కొంది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునికీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలిపింది. ఈ క్రమంలో అణు పదార్థాల భద్రత, న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సేకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఈ భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన వస్తువులు, సాంకేతికతను చైనా నుంచి పాకిస్థాన్ పొందుతున్నట్లు తెలిపింది. వీటిలో కొన్ని నేరుగా కాకుండా హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈ దేశాల ద్వారా మళ్లిస్తున్నట్లు పేర్కొంది. అటు పాకిస్థాన్తో ఇటీవల సైనిక ఘర్షణలు కొనసాగినప్పటికీ భారత్ మాత్రం చైనాను ప్రథమ శత్రువుగా చూస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పాక్లో పనిచేస్తున్న చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని ఇటీవల వరుస ఉగ్రదాడులు జరగడం ఆ దేశాల సంబంధాలను దెబ్బతీస్తున్నట్లు అంచనా వేసింది.

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తత
పహల్గాంలో ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరును కూడా నివేదికలో ప్రస్తావించింది. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులను చేసిందని, అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినట్లు పేర్కొంది. అదేవిధంగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ బలగాల ఉపసంహరణ జరిగినప్పటికీ, దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మాత్రం అపరిష్కృతంగానే ఉందని తెలిపింది.
సింధు జలాల పంపిణీ ఒప్పందం
ఇదిలా ఉండగా, సింధు జలాల పంపిణీ ఒప్పందం కింద పాకిస్థాన్కు రావాల్సిన జలాలను భారత్ పూర్తిగా అడ్డుకోవడం కష్టమే అంటున్నారు పాక్ పరిశోధకుడు మొహమ్మద్ ఉస్మాన్. అందుకు కోసం భారీస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దానికి కొన్నేళ్లు పట్టడమే కాకుండా వందల కోట్ల (బిలియన్ల) డాలర్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ అంతర్జాతీయ వ్యవహారాల సంస్థ (పీఐఐఏ) ఆదివారం కరాచీలో నిర్వహించిన సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పాక్కు సింధు జలాలు ఆపేయాలనుకుంటే భారత్లోని ఎగువ ప్రాంతాలు ముంపు బారిన పడతాయని తెలిపారు.
Read Also: Vladimir Putin : పుతిన్ హెలికాప్టర్ ను టార్గెట్ చేసిన ఉక్రెయిన్…