పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అడుగుపెడుతోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తిగా అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ సంఘీభావ దినోత్సవంలో భాగంగా పీవోకేలో ‘అల్ అక్సా ఫ్లడ్స్’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో హమాస్ కు చెందిన సీనియర్ నేత ప్రసంగించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. రావల్కోట్ లోని సబీర్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థల సీనియర్ నేతలు కూడా పాల్గొనబోతున్నారు.

ఈ కార్యక్రమంలో హమాస్ ప్రతినిధి ఖలీద్ కద్దౌమి ప్రసంగిస్తారని కరపత్రాలు, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్ లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి ఆయన మాట్లాడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు పీఓకేలో ఉన్న జిహాదీ సంస్థలు ఇన్నేళ్లుగా వారు చేస్తున్న పోరాటాలకు బలం చేకూర్చేలా వాదనలు సృష్టించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్, అస్గర్ ఖాన్, ఇలియాస్ మసూద్ వంటి ఉగ్రవాదులు కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఇదే అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న జమ్మూకశ్మీర్ పై హైలెవెల్ మీటింగ్ ను నిర్వహించారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లో వాహన తనిఖీలను తీవ్రతరం చేయాలనిఇంటెలిజెన్స్ నెట్వర్క్ను బలోపేతం చేయడం, సీమాంతర చొరబాట్లను అడ్డుకోవడం సహా పలు కీలక అంశాలపై దృష్టిసారించాలని అధికారులకు కేంద్రమంత్రి ఆదేశించారు.