ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఇరాన్(Iran) అణు కార్యక్రమానికి కీలకమైన పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్(Israel) ప్రకటించింది. ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా క్షిపణి దాడులు చేసింది. కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థను దాటుకుని, నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ చేస్తోన్న దాడుల్లో 224 మంది చనిపోయినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య 24కు చేరింది. ఇరాన్ దాడుల్లో చనిపోయిన వారిలో టెల్ అవీవ్, హాయిఫా, ఇతర నగరాలకు చెందిన ప్రజలు ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన రెండు ప్రముఖ నగరాలు టెల్ అవీవ్, హాయిఫాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. హాయిఫా అనేది ఇజ్రాయెల్లోని ఉత్తర రేవు పట్టణం. ప్రముఖ నౌకాశ్రయం, ఆయిల్ రిఫైనరీ(Oil refinery) ఇక్కడే ఉన్నాయి.

టెల్ అవీవ్, హాయిఫా నగరాలను లక్ష్యంగా..
టెల్ అవీవ్, హాయిఫా, ఇతర ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని డజన్ల కొద్ది ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దాడులు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ రిపోర్టు చేసింది. అయితే, ఇజ్రాయెల్ నగరం హాయిఫాకు భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇజ్రాయెల్కు హాయిఫా ఎందుకంత ప్రత్యేకం?
ఇజ్రాయెల్ వ్యవహారాలపై నిపుణుడైన సీనియర్ జర్నలిస్ట్ హరేంద్ర మిశ్రా ప్రస్తుతం జెరూసలేంలో ఉంటున్నారు. ఇజ్రాయెల్కు హాయిఫా ఎందుకంత ప్రత్యేకమో హరేంద్ర మిశ్రా వివరించారు. ” ఇజ్రాయెల్లో మూడవ అతిపెద్ద నగరం హాయిఫా. ఆ దేశపు ఉత్తరాన ఉన్న ఈ నగరం కేవలం జనాభా పరంగా మాత్రమే కాక, ఆర్థిక పరంగా కూడా చాలా ముఖ్యమైంది. ఈ నగరంలో చాలా హైటెక్ కంపెనీలు బలమైన ఉనికితో ఉన్నాయి. అది మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ లేదా ఇంటెల్ అయినా.. అన్ని హైటెక్ కంపెనీల కార్యాలయాలు హాయిఫాలోనే ఉన్నాయి.” అని తెలిపారు. హాయిఫా నగరం ఇజ్రాయెల్లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా ప్రసిద్ధి. ఇదే ఈ నగర ఆర్థిక ప్రాధాన్యతను పెంచుతోంది. ఇజ్రాయెల్ అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగమేఘాలు కమ్ముకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది.
ఇరాన్ దాడుల తర్వాత వీడియో ఇది
ఇజ్రాయెల్ మీడియా రిపోర్టుల ప్రకారం రిఫైనరీలో కార్యకలాపాలు నిర్వహించే బాజాన్ గ్రూప్ కూడా, రాత్రిపూట ఇరాన్ క్షిపణి దాడులు జరిగినట్లు చెప్పింది. దీనివల్ల పైప్లైన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతిన్నట్లు తెలిపింది. రిపైనరీలో చమురు వెలికితీత పని నడుస్తోందని, కానీ ఆ సైటులో మిగిలిన ప్రాంతాలను మూసివేసినట్లు బాజాన్ గ్రూప్ తెలిపింది. హాయిఫాలో ఇజ్రాయెల్ ప్రముఖ నౌకాశ్రయం ఉంది. ఎన్నో విషయాల్లో ఈ నగరానికి ప్రాధాన్యత ఉంది.”హాయిఫాలో నౌకాశ్రయం చాలా ముఖ్యమైంది. ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో సరుకు రవాణా అవుతూ ఉంటుంది. చారిత్రాత్మక పరంగా చూసుకుంటే, ఇజ్రాయెల్కు బయట ప్రపంచంతో ఘర్షణలు తొలుత ఈ నగరం నుంచే మొదలయ్యాయి” అని హరేంద్ర మిశ్రా తెలిపారు. హాయిఫా నౌకాశ్రయాన్ని 2023లో అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ నౌకాశ్రయానికి చెందిన 70 శాతం వాటా అదానీ గ్రూప్ చేతిలో ఉండగా, 30 శాతం వాటా ఇజ్రాయెల్కు చెందిన గడోట్ గ్రూప్ చేతిలో ఉంది. ఈ నగర జనాభా గురించి వివరించిన హరేంద్ర మిశ్రా… నాలుగు లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరం భిన్న జాతులకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
బహాయీ వరల్డ్ సెంటర్కు నిలయం హాయిఫా
”గణనీయమైన సంఖ్యలో అరబ్ జనాభా ఇక్కడ ఉన్నారు. వీరిలో ముస్లింలు, క్రిస్టియన్లు ఇద్దరూ ఉన్నారు. బహాయీ కమ్యూనిటీకి చెందిన ఆధ్యాత్మిక ప్రాంతం కూడా ఉంది. అచ్చం దిల్లీలో లోటస్ టెంపుల్ మాదిరి. ఇక్కడ బహాయీ గార్డెన్ ఉంది” అని తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం బహాయీ వరల్డ్ సెంటర్కు నిలయం హాయిఫా.
ఎందుకు కేవలం టెల్ అవీవ్, హాయిఫాలనే లక్ష్యంగా చేసుకుంది?
ఈ నగర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ దీనిపై దాడులు చేసిందా? అనే దానిపై హరేంద్ర మిశ్రా మాట్లాడారు. ” అత్యధిక వ్యూహాత్మక, ఆర్థిక ప్రాధాన్యత ఉన్న నగరాలను మాత్రమే ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని నేను భావిస్తున్నా. ఇప్పటి వరకు జెరూసలేం జోలికి వెళ్లలేదు. ఎందుకంటే, ఎన్నో మతాలకు ఇది పవిత్ర ప్రదేశం” అని చెప్పారు. ఇరాన్ క్షిపణులు చాలా వరకు నివాస ప్రాంతాలపైనే పడ్డట్లు ఆయన తెలిపారు. హాయిఫా, టెల్ అవీవ్ లాంటి నగరాలు ఎక్కువ జనసాంద్రతతో ఉంటాయి. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముకగా పరిగణిస్తుంటారు.మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో తుర్కియే, జర్మనీ, ఆస్ట్రియా-హాంగేరీలకు చెందిన సంయుక్త దళాల ఆక్రమణ నుంచి హాయిఫా నగరానికి స్వతంత్రత కల్పించేందుకు బ్రిటీష్ సామ్రాజ్యం తరఫున భారత అశ్విక దళం పోరాడింది.
Read Also: Trump: ఇరాన్ సుప్రీం లీడర్ ఆచూకీ తెలిసినా చంపం: ట్రంప్