అమెరికా లో ఉంటున్న అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం వెనక్కి పంపుతోంది. ఇప్పటికే 104 మంది భారతీయులను అమెరికా మిలటరీ విమానం C-17 మోసుకొచ్చింది. మరింతమందిని వెనక్కి పంపే ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ చేరుకున్న వలసదారుల పరిస్థితి ఏమిటన్న చర్చ మొదలైంది. వీరికి భారత్లో పెద్దగా చిక్కులు ఎదురు కాకపోవచ్చు కానీ, తిరిగి అమెరికా ముఖం మాత్రం చూడలేరన్నది వాస్తవం. బహిష్కరణకు గురైన వారికి వీసాలు ఇచ్చేందుకు మెజారిటీ దేశాలు అంగీకరించవు.వారు నిజమైన భారత్ పాస్పోర్ట్, చెల్లుబాటు అయ్యే సొంత ధ్రువీకరణ పత్రాలు ఉంటే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని సీనియర్ అడ్వకేట్, ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ తెలిపారు. కొందరు వలసదారులు నకిలీ పాస్పోర్ట్, వేరేవారి పాస్పోర్ట్పై తమ ఫొటో అంటించుకోవడం, పేరు, పుట్టిన తేదీ మార్చుకోవడం వంటివి చేసి అక్రమ మార్గాల్లో (డంకీ రూట్) వెళ్లిన వారు మాత్రం చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని ఆయన తెలిపారు.

వలస వెళ్లిన వారిలో చాలామంది పాక్షిక అక్షరాస్యులని, పేద కుటుంబాలకు చెందినవారని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన అతుల్ నందా తెలిపారు. వారు నకిలీ పత్రాలతో వెళ్లే అవకాశం తక్కువని చెప్పారు. బహిష్కరణకు గురైన వలసదారులు ఆతిథ్య దేశంలో ఏదైనా నేరాలకు పాల్పడినా, భారత్లో ఏదైనా పాస్పోర్ట్ మోసానికి పాల్పడితే తప్ప వారిపై ఎటువంటి విచారణ జరగదని అక్రమ వలసదారులకు సంబంధించిన సమస్యలపై పనిచేసిన న్యాయవాది కమలేశ్ మిశ్రా తెలిపారు. అయితే, వారు ఉపయోగించిన పత్రాలు సరైనవో, కావో తెలుసుకునేందుకు మాత్రం ప్రశ్నించవచ్చని పేర్కొన్నారు. లక్షల రూపాయలు తీసుకుని వారిని అక్రమంగా విదేశాలకు పంపిన ఏజెంట్లపై మాత్రం చర్యలు తప్పవు. అక్రమ వలసదారులుగా బహిష్కరణకు గురైనవారు మళ్లీ వెళ్లే అవకాశం లేదని న్యాయవాదులు చెబుతున్నారు.