అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసిన రోజున నుంచి అనేక దేశాలకు భయం పుడుతున్నది. ఇందులో కొలంబియా కూడా చేరింది. తాజాగా కొలంబియా విధిస్తామంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలకు కొలంబియా దిగొచ్చింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించింది. ఈ విషయాన్ని వైట్హౌస్ తాజాగా వెల్లడించింది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ చర్యను కొలంబియా తీవ్రంగా వ్యతిరేకించింది. వలసలతో వస్తున్న అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పష్టం చేశారు. వలసదారులన గౌరవంగా పంపించేందుకు నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే తమ దేశంలోకి వచ్చిన అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపినట్లు చెప్పారు. అయితే, గుస్తావో పెట్రో నిర్ణయంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలతో పాటు కఠిన వీసా ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.

కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాదు కొలంబియన్ ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే కొలంబియా దిగొచ్చినట్టు తెలుస్తోంది. ట్రంప్ విధానాలకు ఓకే చెప్తూ.. అక్రమవలసదారులు అందరినీ స్వీకరించేందుకు కొలంబియా అంగీకరించినట్లు వైట్హౌస్ వెల్లడించింది. శరణార్థులను తీసుకొస్తున్న అమెరికా మిలిటరీ విమానాలపై ఎటువంటి ఆంక్షలు, జాప్యం ఉండదని అక్కడి ప్రభుత్వం పేర్కొన్నట్టు తెలిపింది. ఇక కొలంబియా వెనక్కి తగ్గడంతో.. ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.