ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్(Iran)లో ఉన్న భారతీయ(Indian) విద్యార్థులు ఆందోళన చెందారు. గత మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బాంబు పేలుళ్ల శబ్దాలకు బేస్ మెంట్లోకి పరుగెడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులను ఇరాన్లోని ఇండియన్ ఎంబసీ(Indian Embassy) సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
‘మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు’
టెహ్రాన్లోని షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలో జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాకు చెందిన ఇంతిసల్ మోహిదిన్ ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. తమ విశ్వవిద్యాలయంలో 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఇంతిసల్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్లో చిక్కుకున్న వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థులలో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు పెద్ద పేలుళ్ల శబ్దాలకు మేల్కొని బేస్ మెంట్ లోకి పరుగెత్తామని వెల్లడించారు. అప్పటి నుంచి విద్యార్థులందరూ నిద్రలేని రాత్రులను గడుపుతున్నారని పేర్కొన్నారు.

ప్రతి రోజు రాత్రి పేలుళ్ల శబ్దాలు
“విద్యార్థుల హాస్టళ్లు, అపార్ట్మెంట్ల నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పేలుళ్లు సంభవించాయి. దీంతో స్టూడెంట్స్ లో భయం పెరుగుతోంది. అందుకే భారత ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలి. మేము మా అపార్ట్మెంట్ బేస్మెంట్ లో చిక్కుకున్నాము. ప్రతి రోజు రాత్రి పేలుళ్ల శబ్దాలు వింటున్నాం. పేలుళ్ల జరిగిన ప్రాంతం మాకు కేవలం 5 కి.మీ దూరంలోనే ఉంది. మేము మూడు రోజులుగా నిద్రపోలేదు. బాంబు దాడుల కారణంగా విశ్వవిద్యాలయం తరగతులను నిలిపివేసింది. పరిస్థితి మరింత దిగజారకముందే మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ లను ఏర్పాటు చేసింది. మాతో టచ్ లో ఉంది. కానీ మేము భయపడుతున్నాం. ఇంటికి వెళ్లాలని ఉంది” అని మోహదీన్ తెలిపారు.
భయాందోళనలో విద్యార్థులు
అలాగే, కెర్మాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో శ్రీనగర్కు చెందిన ఫైజాన్ నబీ ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆయన ఇరాన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. టెహ్రాన్ కంటే కెర్మాన్ కాస్త సురక్షితమైనది అయినప్పటికీ, తమకు భయం వేస్తోందన్నారు. కెర్మాన్ నగరంలో ఆదివారం తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నామని తెలిపారు. టెహ్రాన్ లోని తన స్నేహితులు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
‘యూనివర్సిటీ మాకు అండగా లేదు’
ఇరాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థిని మిథాత్ సైతం భయాందోళనకు గురయ్యారు. “పేలుళ్లు మాకు కిలోమీటర్ల దూరంలోనే జరిగాయి. అందరూ భయాందోళనకు గురయ్యారు. నా కుటుంబంతో టచ్ లో ఉన్నాను. భారత రాయబార కార్యాలయం వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తోంది. మా విశ్వవిద్యాలయం మాకు అండగా లేదు. భయపడి యూనివర్సిటీ లోపలే ఉంటున్నాం. ఇది ఎంతకాలం కొనసాగుతుందో మాకు తెలియదు. ” అని మిథాత్ పేర్కొన్నారు.
సురక్షిత ప్రదేశాలకు భారతీయ విద్యార్థులు
ఇరాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో టెహ్రాన్ లోని భారతీయ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యార్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలాగే టెహ్రాన్లో భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇతర ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం నాడు టెహ్రాన్ లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులందరూ ఇంటి లోపలే ఉండి అధికారుల ఆదేశాలను పాటించాలని కోరింది. ఇరాన్లోని ప్రతి ఒక్కరూ ఎంబసీ నుంచి వచ్చే ఆదేశాలను పొందడానికి టెలిగ్రామ్ లింక్లో చేరాలని అభ్యర్థించింది.
Read Also: Qatar: ఖతర్లో తెలుగు పాస్టర్లు అరెస్ట్