బలవంతపు మత మార్పిడులను నిరోధించేందుకు రాజస్థాన్లోని భజన్ లాల్ శర్మ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం బడ్జెట్ సమావేశాల వేదికగా రాజస్థాన్ చట్టవిరుద్ద మత మార్పిడి నిషేధ బిల్లు 2024 రాజస్థాన్ ప్రోహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలిజియన్ బిల్లు 2025ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే గతేడాది అంటే 2024, నవంబర్లో ఈ బిల్లు ముసాయిదాను భజన్ లాల్ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించిన సంగతి తెలిసిందే. మత మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకోన్న వారు.. దాదాపు రెండు నెలల ముందు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తాము మత మార్పిడి చేసుకోవాలని తమ సొంతంగా నిర్ణయం తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారి ముందు ఒప్పుకోవాల్సి ఉంది. ఇందులో ఎవరి బలవంతం కానీ.. ఎవరి ప్రోద్బలం కానీ లేదని తెలిపాలి. అనంతరం మత మార్పిడికి అనుమతి లభిస్తోంది. అయితే రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు చోటు చేసుకొంటున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో వాటిని నిరోధించేందుకు రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు చేపట్టనుంది. ఓ వేళ షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన వారితోపాటు మహిళలు, మైనర్లను బలవంతంగా మత మార్పిడులకు పాల్పడితే.. రెండు నుంచి 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 25 వేల వరకు జరిమానా సైతం విధించే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ఇక ఈ మత మార్పిడి నిరోధక బిల్లుపై రాజస్థాన మంత్రి కె.కె.బిష్ణోయ్ మాట్లాడుతూ.. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా అమాయక బాలికలను ప్రలోభపెట్టడాన్ని ఆపవచ్చని ఆయన పేర్కొన్నారు.