ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ అదానీలకు బొంబాయి హైకోర్టు సోమవారం భారీ ఊరటనిచ్చింది. దాదాపు ₹388 కోట్ల మార్కెట్ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలకు సంబంధించిన కేసు నుండి వారిని కోర్టు విముక్తి చేసింది. 2012లో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) ఇంకా దాని ప్రమోటర్లైన గౌతమ్ అదానీ, రాజేష్ అదానీలతో సహా 12 మందిపై కుట్రపూరితంగా మోసం చేశారనే అభియోగంతో కేసు నమోదు చేసింది. SFIO ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది.

అదానీ సోదరులను కేసు నుంచి విముక్తి
ఈ కేసు నుండి తమను తప్పించాలని కోరుతూ 2019లో సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అదానీ సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఆర్.ఎన్. లద్దా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం సోమవారం సెషన్స్ కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ, అదానీ సోదరులను కేసు నుంచి విముక్తి కల్పించింది.కోర్టు పూర్తి ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది.అయితే, 2019 డిసెంబర్లోనే హైకోర్టు సెషన్స్ కోర్టు తీర్పుపై స్టే విధించింది.ఈ స్టే కాలానుగుణంగా పొడిగిస్తూ వచ్చారు.
12 మందిపై నేరపూరిత కుట్ర
వాస్తవానికి 2012లో SFIO దాఖలు చేసిన ఛార్జ్షీట్లో అదానీలతో పాటు మొత్తం 12 మందిపై నేరపూరిత కుట్ర మోసం ఆరోపణలు ఉన్నాయి. కానీ,ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు 2014 మే నెలలోనే వారిని కేసు నుండి విముక్తి కల్పించింది. మేజిస్ట్రేట్ కోర్టు విడుదల ఉత్తర్వును SFIO సెషన్స్ కోర్టులో సవాలు చేసింది. 2019 నవంబర్లో సెషన్స్ కోర్టు మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును రద్దు చేసింది. అదానీ గ్రూప్ అక్రమంగా లాభపడిందని SFIO ప్రాథమికంగా గుర్తించిందని సెషన్స్ కోర్టు వ్యాఖ్యానించింది.దీంతో పారిశ్రామికవేత్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ సెషన్స్ కోర్టు ఉత్తర్వు “నిర్లక్ష్యంగా, చట్టవిరుద్ధంగా” ఉందని వాదించారు. ఈ కేసు దాదాపు రూ.388 కోట్ల మార్కెట్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించినది. SFIO విచారణలో నియంత్రణ సమ్మతి, ఆర్థిక లావాదేవీలపై సందేహాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.