దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. బుధవారం ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రితో పోలింగ్ సిబ్బంది బూత్లకు తరలి వెళ్తోన్నారు. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు.

సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. చాలామంది ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు.15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు. 2020 నాటి ఎన్నికల్లోనూ చరిత్ర తిరగరాసింది ఆప్. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలను కొల్లగొట్టింది. ఇప్పుడూ అలాంటి రికార్డే సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా- పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఛాంబర్స్ ఆఫ్ ట్రేడర్స్ అండ్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ 50 శాతం వరకు డిస్కౌంట్ను ప్రకటించింది. దీని పరిధిలోని అన్ని దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, కిరాణా షాపులు, హోటళ్లు, మాల్స్, ధాబాలు, కాఫీ షాపులు.. ఇలా అన్నింట్లోనూ 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.