సంక్రాంతికి వస్తున్నాం దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ఈ సినిమా నిర్మాణ వ్యయంపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చింది.ఈ విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, ఇది ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. తమ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా విచారణ జరిపే అధికారం దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఉంటుందని, విచారణ జరిపించాలా లేదా అన్నదీ అవే నిర్ణయించాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైకోర్టు అసహనం
సినీ నిర్మాణ ఖర్చులపై ఈడీతో విచారణ జరిపించాలని ఆదేశిస్తే దర్యాప్తు ప్రక్రియను న్యాయస్థానం దుర్వినియోగం చేసినట్టు అవుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నిర్మాణ వ్యయంపై ఈడీ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది.సరైన ఆధారాలు లేకుండా పిటిషనర్ ఊహాజనిత ఆరోపణలతో పిల్ దాఖలు చేసి, దర్యాప్తు కోరుతున్నారని కోర్టు మండిపడింది. అంతేకాదు, టికెట్ ధరల పెంపు అంశంపై విచారించాల్సింది ఏమీ లేదని, ఇప్పటికే అదనపు షోల ప్రదర్శన పూర్తయిందని పేర్కొందది. కేవలం ప్రచారం కోసం ఈ పిల్ వేశారని అసహనం వ్యక్తం చేసింది.
సినిమా టికెట్ ధరల పెంపు
సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం జనవరి 8న అనుమతి ఇస్తూ ఉత్తర్వులు చేసింది. దీనిని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన ఎంలక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి వేసిన పిల్ను హైకోర్టు కొట్టివేసింది.భారీ బడ్జెట్తో నిర్మించిన సినిమా టికెట్ ధరల పెంపును విడుదలైన తొలి పది రోజుల వరకు పరిమిత చేస్తూ మార్చి 7, 2022లో జారీచేసి జీఓ 13ను సవరించే ప్రతిపాదనలో ప్రభుత్వం ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది.

పిటిషన్
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. కాగా, 14 రోజుల పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ పిటిషన్ వేశారు. అతడి తరఫున లాయర్ గుండాల శివప్రసాద్రెడ్డి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి వాదనలు వినిపించారు.
విచారణ
న్యాయస్థానం స్పష్టం చేసిన విధంగా, సినిమా నిర్మాణ ఖర్చుల విచారణ ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. దర్యాప్తు సంస్థలు మాత్రమే విచారణ జరిపే అధికారం కలిగి ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు ప్రకారం, పిటిషనర్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో, ఈ పిటిషన్ను కొట్టివేసింది.