అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్తో బెంబేలెత్తిస్తోన్నారు. భారత్ సహా పలు దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవే అవన్నీ కూడా. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపడం మొదలుకుని నిధుల నిలిపివేత వరకూ ఆయన వేసిన ప్రతి అడుగూ ప్రకంపనలను పుట్టిస్తూ వచ్చినవే. భారత్ సహా ట్రంప్ టారిఫ్ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్ను అదనంగా చెల్లించాల్సి వచ్చింది.

25 శాతం వరకు టారిఫ్ పెంపు
ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. తాజాగా ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు. 25 శాతం వరకు టారిఫ్ పెంచారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. అమెరికాకు ఆటోమోటివ్ వాహనాలను ఎగుమతి చేస్తోన్న భారత్ సహా అన్ని అన్ని దేశాలపైనా దీని ప్రభావం పడినట్టయింది. ఈ టారిఫ్.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
తమ దేశం చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది
తమ మంచితనాన్ని ఇతర దేశాలు సొమ్ము చేసుకున్నాయని, ఇన్నాళ్లూ తమ ఉత్పత్తులపై భారీగా టారిఫ్ వసూలు చేశాయని గుర్తు చేశారు. అందుకే ఈ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ తెలిపారు. తమ దేశ పౌరులు ఆశ్చర్యపోయేలా టారిఫ్ ఉంటోందని, ఈ విధానం వారిని ధనవంతులుగా మార్చుతుందనీ పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో అమెరికాకు 600 నుండి ఒక ట్రిలియన్ డాలర్ల వరకు ఆదాయాన్ని పెంచుతుందనే నమ్మకం ఉందని, ఫలితంగా- తమ దేశం చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని డొనాల్ట్ ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే- డొమెస్టిక్ ఆటోమోటివ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కు ఈ టారిఫ్ ఊతం ఇస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారాయన.