అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ఆర్య 2 ప్రత్యేక స్థానం దక్కించుకుంది. 2009లో విడుదలైన ఈ చిత్రం, సూపర్ హిట్ అయిన “ఆర్య”కి సీక్వెల్గా వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కాజల్ అగర్వాల్ కథానాయికగా, నవదీప్ ముఖ్య పాత్రలో నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ చిత్రం విడుదలై ఇప్పుడు 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ రీరిలీజ్ చేశారు.ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు హౌస్ ఫుల్ కావడం విశేషం. ఇంత భారీ క్రేజ్ మధ్య ‘ఆర్య 2’ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ‘పుష్ప 2’ ఇన్సిడెంట్ కారణంగా అధికారులు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
భారీ భద్రత
‘పుష్ప 2’ మూవీ గత ఏడాది రిలీజై ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 మూవీ థియేటర్లలో మరోసారి సందడి చేయడానికి సిద్ధమవ్వడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. అనుకున్నట్టుగా ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ‘ఆర్య 2’ మూవీకి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ మూవీ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్యా 70ఎంఎం, 35ఎంఎం థియేటర్లలో కూడా రిలీజ్ అయింది. కానీ ‘పుష్ప 2’ మూవీ టైంలో జరిగిన దురదృష్టకర సంఘటనను దృష్టిలో పెట్టుకొని భారీ భద్రత మధ్య ఇక్కడ మూవీని రిలీజ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి థియేటర్ ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మోహరించడం విశేషం. ఇప్పుడు ఏకంగా అక్కడ 30 మంది పోలీసులు మోహరించారు. అలాగే అక్కడికి వచ్చే ఆడియన్స్ బ్యాగ్స్, వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తొక్కిసలాట
‘పుష్ప’ బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ గా రూపొందింది ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న మరోసారి మెయిన్ లీడ్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వెళ్లారు. అప్పటికే అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర సంఘటనలో రేవతి అనే 35 ఏళ్ల మహిళ అక్కడికక్కడే కన్నుమూసింది. 9 ఏళ్ల ఆమె కుమారుడు ఇంకా కోలుకోలేదు. ఈ వివాదంలో అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
రీ రిలీజ్ చిత్రాలలో కచ్చితంగా ఆల్ టైం రికార్డు సాదిస్తుందని అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం కనీసం ఇప్పుడు టాప్ 10 లోకి అయినా అడుగుపెడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాకు సరిపడా ప్రొమోషన్స్ చేయకపోవడం వల్లే, ఈ చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుందని కేవలం వారం రోజుల ముందు మాత్రమే ప్రకటించారు. అదేదో ముందుగానే ప్రకటించి ఉంటే భారీ ప్రొమోషన్స్ చేసి, ఈ సినిమాకు ఆల్ టైం రికార్డుని నెలకొల్పే వాళ్లమని అంటున్నారు. ఒకవేళ ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ పడినా, లాంగ్ రన్ లో ఈ చిత్రం కుమ్మేసే అవకాశాలు ఉన్నాయని, కచ్చితంగా ఈ చిత్రంలోని పాటలు మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాయని అంటున్నారు.