తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఓ రాష్ట్ర శాసనసభ పంపించిన బిల్లులను ఆమోదించకుండా పక్కన పెట్టే అధికారం గవర్నర్కు లేదని తేల్చి చెప్పింది. అలాంటి వీటో అధికారాలు గవర్నర్కు ఉండబోవని స్పష్టం చేసింది.
ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు ఈ తీర్పు ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ తీర్మానించి రాజ్భవన్కు పంపించిన 10 బిల్లులకు సంబంధించి గవర్నర్ ఆర్ ఎన్ రవి తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని ప్రకటించింది.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన డీఎంకే
సాధారణంగా ఓ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆ బిల్లులు ఉంటేనే గానీ వాటిని పునఃపరిశీలనకు పంపించే అవకాశం దాదాపుగా ఉండదు. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులకు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఉద్దేశపూరకంగా అడ్డుకున్నారనేది ప్రభుత్వం వాదన. దీన్ని సవాల్ చేస్తూ తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీన్ని కోర్టు విచారణకు స్వీకించింది.
ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వి తదితరులు వాదనలు
తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి, రాకేష్ ద్వివేది, పీ విల్సన్ తమ వాదనలను వినిపించారు. తమిళనాడు గవర్నర్ తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదించారు. విచారణ సందర్భంగా జస్టిస్ పార్దీవాలా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ అలసత్వం వహించారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడానికి స్పష్టంగా కాలపరిమితి లేదని, ఎలాంటి సమయ పరిమితులు లేనప్పటికీ, తనకు అందిన బిల్లులను ఆమోదించకపోవడం, దీనివల్ల రాష్ట్రంలో చట్టాల రూపకల్పన ప్రక్రియను ఆలస్యం చేయడానికి అంగీకరించినట్టయిందని వ్యాఖ్యానించింది.