ప్రకృతి పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, పర్యావరణాన్ని కాపాడే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడమే కాకుండా, స్థానిక వృక్ష జాతులను రక్షించేందుకు, పక్షుల ఆవాసాలను ప్రోత్సహించేందుకు బయోడైవర్సిటీ పార్కులను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం, అమరావతి నగరాల్లో జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసేలా ఈ పార్కులను ఏర్పాటు చేయనుంది.పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచడం. స్థానిక వృక్షజాతులను పునరుద్ధరించడం. పక్షుల, ఇతర జీవుల నివాసాలను పరిరక్షించడం. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచడం.
స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు
తిరుపతిలో జరిగిన ఓ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు (ఏపీఎస్బీబీ) ఛైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్బంగానే ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బయోడైవర్సిటీ పార్కుల ఏర్పాటు ద్వారా పట్టణాలలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలీస్తే పట్టణ ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ. ఈ నేపథ్యంలో పట్టణాలలో జీవ వైవిధ్యాన్ని కాపడటానికి ఈ బయోడైవర్సిటీ పార్కుల ఆలోచన చేస్తున్నారు.అలాగే తలకోన, కపిలతీర్థం ప్రాంతాలను బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్లుగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తిరుపతిలో జీవవైవిధ్య ఉద్యానవనం
తిరుమల కొండలలో ఒకప్పుడు వేప, సుబాబుల్ చెట్లు భారీ సంఖ్యలో ఉండేవన్న ఏపీఎస్బీబీ ఛైర్మన్, ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయిందన్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి తిరుపతిలో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాలలో నిర్మాణాలు, అభివృద్ధి కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అధికారులు, పర్యావరణానికై పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్య, పరిరక్షణ, సాంస్కృతిక కార్యకలాపాల కేంద్రంగా బయోడైవర్సిటీ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

విశాఖపట్నం, అమరావతి బయోడైవర్సిటీ పార్కులు
విశాఖపట్నంలో పారిశ్రామిక వృద్ధితో పాటు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంగా బయోడైవర్సిటీ ఉద్యానవనం ఏర్పాటు చేయనున్నారు. ఇదే విధంగా, అమరావతిలో అభివృద్ధి పనులతో కూడిన జీవవైవిధ్య పరిరక్షణ ప్రణాళిక అమలులోకి రానుంది.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన
బయోడైవర్సిటీ పార్కులు, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ల ద్వారా ప్రజల్లో పర్వావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని ప్రభుత్వం ఆలోచన. వీటి ద్వారా పచ్చదనం పెరగటంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే తిరుపతి, విశాఖ, అమరావతిపై బయోడైవర్సిటీ పార్కుల అభివృద్ధిపై ఆలోచనలు చేస్తోంది.