వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్ల గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై జరిగిన దాడి ఘటనలో ఆయనపై కేసు నమోదు కాగా, మాధవ్ తో పాటు మరో ఐదుగురికి గుంటూరు కోర్టు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వీరందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే గోరంట్ల మాధవ్ అరెస్టు నుంచి రిమాండ్ వరకూ వరుస ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

అనుచిత వ్యాఖ్యలతో వివాదం
ఈ వివాదం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైన అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ సమయంలో గోరంట్ల మాధవ్, తన అనుచరులతో కలిసి అడ్డగించిన ఘటన ఈ వివాదాన్ని మరింత మలుపు తిప్పింది.
కేసు నమోదు
చేబ్రోలు కిరణ్ను తీసుకెళ్తున్న సమయంలో మాధవ్ నేతృత్వంలో జరిగిన దాడి ప్రయత్నంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం గోరంట్ల మాధవ్తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇది పూర్తిగా రాజకీయంగా మారిపోయింది. ఒక మాజీ ఎంపీగా ఉన్న వ్యక్తి పోలీసుల ఎదుట దాడికి యత్నించాడన్న ఆరోపణలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. గోరంట్ల మాధవ్ను అరెస్టు చేసిన తర్వాత, పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే యత్నం చేశారు. అయితే మాధవ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, “నాకు ఇంకా మాజీ ఎంపీగా హోదా ఉంది, మామూలు నేరస్థులా మీడియా ముందు ఎలా చూపుతారు?” అంటూ వాగ్వాదానికి దిగారు. చివరికి మీడియా ముందు కాకుండా, వైద్య పరీక్షల అనంతరం నేరుగా కోర్టుకు తరలించారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకు మాధవ్
గుంటూరు కోర్టులో గోరంట్ల మాధవ్ చేబ్రోలు మాధవ్ పై దాడి చేసిన కేసులో పోలీసులు రిమాండ్ కోరారు. దీంతో గుంటూరు కోర్టు న్యాయమూర్తి రెండు వారాల రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ పై గోరంట్ల మాధవ్ తో పాటు మరో ఐదుగురిని నెల్లూరు కోర్టుకు తరలించాలని ఆదేశించారు. కానీ అక్కడ ఏర్పాట్లు సరిగా లేవని, అక్కడకు పంపితే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు జడ్జి దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి నెల్లూరు జైలుకు కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వీరిని తరలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిని అర్ధరాత్రి రాజమండ్రి జైలుకు తరలించారు.
Read also: AP Inter Results : నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల