తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తన సూటి వ్యాఖ్యలతో, తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ అపర గోబెల్స్లా మాట్లాడుతున్నారని, మరో మూడేళ్లలో అధికారంలోకి వస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే, ఆయన వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకేనని జోస్యం చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని విమర్శించారు. జగన్ మళ్లీ జైలు జీవితం గడపాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
రైతులకు నష్టమేనన్న గోరంట్ల
గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సహాయం చేయలేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. పంటలకు బీమా చెల్లించకపోవడంతో రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని తెలిపారు. జగన్ పాలనలో గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదని ఆయన దుయ్యబట్టారు.
సంక్షేమ పథకాలు
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. మే నెలలో ‘తల్లికి వందనం’, జూన్లో ‘అన్నదాత సుఖీభవ’ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి, పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

క్రికెట్ స్టేడియం
రాజమండ్రిలో 12 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో చర్చలు జరిగాయని తెలిపారు. గతంలో వైసీపీ కార్యాలయానికి స్థలం వెంటనే కేటాయించారని, అయితే టీడీపీ కార్యాలయానికి స్థలం ఇవ్వడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజన
నియోజకవర్గాల పునర్విభజనపైనా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ అంశంపై కేంద్రంతో అంతర్గతంగా చర్చిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించకూడదని ఆయన పేర్కొన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించాయని, ఇప్పుడు జనాభా ప్రాతిపదికన సీట్లు తగ్గించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.