అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త చెబుతూ.. అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించారు. EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీన్ని పొందాలనుకునేవారు 5 మిలియన్ల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని కూడా వెల్లడించారు. దీని వల్ల తమ దేశ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి, దీనికి అర్హులు ఎవరో ఆ వివరాలు మీకోసం.

అందుబాటులో గోల్డ్ కార్డ్ వీసా
పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ వల్ల అనేక మోసాలు, అక్రమాలు జరుగుతుండగా.. వాటన్నిటికీ అమెరికా సర్కారు చెక్ పెట్టింది. ముఖ్యంగా EB-5 వీసా ప్రోగ్రామ్ స్థానంలోకి గోల్డ్ కార్డ్ వీసాను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు నేరగా యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే 5 మిలియన్ల డాలర్లు చెల్లించి ఈ వీసాను కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. ఈ వీసాను పొందిన వాళ్లు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారని కూడా ట్రంప్ వెల్లడించారు. గోల్డ్ కార్డ్ వీసా దారుల అనేక విజయాలు సాధిస్తారని, వారు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు కూడా చెల్లిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీరి వల్ల దేశం రుణం తగ్గుతుందని వివరించారు.
అక్రమాలను అరికట్టేందుకు ఈ వీసాలు
అలాగే దీనిపై వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్ని స్పందిస్తూ.. మరో రెండు వారాల్లో EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గోల్డ్ కార్డు లాంటిదేనన్నారు. EB-5 ప్రోగ్రామ్ వల్ల జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకు వస్తున్నట్లు వివరించారు.