ఒక మహానగరంగా హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, నగర పాలక సంస్థ అయిన జీహెచ్ఎంసీ (GHMC) ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు అక్రమ నిర్మాణాలు. గత కొన్నేళ్లుగా అనుమతులు లేకుండా, మంజూరైన ప్లాన్ను ఉల్లంఘించి, నిబంధనలను అతిక్రమించి నిర్మించబడుతున్న భవనాలు నగర రూపాన్ని దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయి.

హైకోర్టు ఆదేశాలతో మరింత గట్టిగా జీహెచ్ఎంసీ
తాజాగా తెలంగాణ (Telangana) హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై పట్టుబట్టి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అక్రమ నిర్మాణాలు, అనుమతి తీసుకున్న దాని కంటే అదనంగా నిర్మించిన అంతస్తులను సీజ్ చేయాల్సిందిగా కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా నిర్మాణాలను సీజ్ చేయడమేకాక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయాలని తెలిపారు. ఇందుకుగాను జీహెచ్ఎంసీ చట్టం 1955, సెక్షన్ 461-ఏ, టీజీ-బీపాస్ నిబంధనల ప్రకారం సంక్రమించిన అధికారాలతో అలాంటి భవనాలు సీజ్ చేసే అవకాశముందని కమిషన్ కర్ణన్ తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు.
మూడు రోజుల గడువు – నివాసితులకు ముందస్తు నోటీసులు
ఇప్పటికే ఇలాంటి భవనాల్లో నివసిస్తున్న వారికి మూడు రోజుల గడువు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ గడువు పూర్తయ్యాక వాటిని సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇక భవనానికి ఉన్న అన్ని ప్రవేశ, బయటకు వెళ్లే దారులు, లిఫ్ట్, మెట్లు, ర్యాంపులను ఎరుపు రంగు రిబ్బన్తో మూసి వేయాలని తెలిపారు.
ఇక తప్పు చేసినవారికి కఠిన చర్యలు తప్పవు
GHMC ప్రకారం, తప్పుడు సమాచారం ఆధారంగా అనుమతులు పొందినా, మంజూరైన ప్లాన్కు భిన్నంగా నిర్మాణం చేపట్టినా, అవన్నీ దోషాలుగా పరిగణిస్తారు. అధికారులకు తప్పుడు సమాచారం అందించి వారిని తప్పుదోవ పట్టిస్తే అలాంటి నిర్మాణాన్నిసీజ్ చేయవచ్చు. రెండు ఆమోదించిన ప్లాన్కు భిన్నంగా నిర్మాణం చేపట్టినప్పుడు కూడా సీజ్ చేయవచ్చని తెలుస్తోంది. డిసెంబర్ 2024న సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఈ ప్రక్రియలో పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాక షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగిస్తే అలాంటి నిర్మాణాలను వెంటనే సీజ్ చేయవచ్చని చెబుతుంది.
హైదరాబాద్లో భవిష్యత్తు నిర్మాణాలకు గట్టి నిబంధనలు
ఈ చర్యలతో భవిష్యత్తులో GHMC పరిధిలో భద్రతా ప్రమాణాలకు లోబడి నిర్మాణాలు ఉండేలా చేయాలి. అనుమతుల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా TG-BPASS విధానం పనిచేస్తోంది. అక్రమ నిర్మాణాల ద్వారా కలిగే భౌగోళిక, శాస్త్రీయ, శహరీ అసమతుల్యతలను తగ్గించాలన్నదే GHMC లక్ష్యం. జీహెచ్ఎంసీ తాజా చర్యలు చూస్తే, ఇకపై హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు ఆస్కారం ఉండదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.