ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండో బ్లాక్లోని బ్యాటరీలు ఉంచే ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు సమాచారం.ఈ సంఘటన తెలియగానే ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత పేషీలు ఉన్నాయి. తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ కార్యాలయం లోపల లేరని సమాచారం.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటన పై హోంమంత్రి అనిత ఆరా తీశారు.
హోంమంత్రి అనిత ఆరా
సచివాలయంలోని రెండో బ్లాక్లో జరిగిన అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీస్ ఉన్నతాధికారులు హోం మంత్రికి వెల్లడించారు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని సంబంధిత అధికారులను హోంమంత్రి ఆదేశించారు.

ఇలా వివిధ శాఖల కార్యాలయాలు ఉండటంతో నిత్యం అధికారులు, సామాన్య ప్రజలతో సచివాలయం రెండో బ్లాక్ కిటకిటలాడుతుంది. అయితే తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదంలో కొంత ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు సచివాలయ భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.అయితే ఈ ఘటన ప్రమాద వశాత్తు జరిగిందా లేదా కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణం పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో పోలీసుల కఠిన ఆంక్షలు విధించారు.అంతేకాకుండా, పోలీసుల మోహరింపు కూడా పెంచారు.పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీడియాకు అనుమతులు ఇవ్వబడతాయని పోలీసులు చెబుతున్నారు.