కాకినాడలో హోలీ పండుగ నాడు జరిగిన దారుణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని భావించిన ఓ తండ్రి వారిని చంపేసి తాను ఉరివేసుకున్నాడు.ఈ ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ (ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్) గా పనిచేస్తున్నాడు.తన కుమారుడు జోషిల్ (7) మరియు కుమారుడు నిఖిల్ (6) ను హత్యచేసి, తాను ఉరి వేసుకున్నాడు.
పిల్లలు సరిగా చదవడం లేదని మనస్తాపం
హోలీ పండుగ నాడు కాకినాడలోని సుబ్బారావునగర్లో జరిగింది ఈ దారుణం. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ భార్య తనూజ, ఒకటో తరగతి చదివే కుమారుడు జోషిల్ (7), యూకేజీ చదివే చిన్న కుమారుడు నిఖిల్ (6),తో కలిసి నగరంలోని ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు. పిల్లలుసరిగ్గా చదవడం లేదని ఇటీవల వారు చదువుతున్న స్కూల్ మార్పించాడు.
బకెట్లో ముంచి చంపేసిన వైనం
చంద్రకిశోర్ నిన్న భార్య, పిల్లలతో కలిసి ఆఫీసులో నిర్వహించిన హోలీ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు వెళ్తున్నానని, అక్కడే ఉండాలని, పది నిమిషాల్లో వస్తానని భార్యను నమ్మించి పిల్లలను తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో అనుమానం వచ్చి తనూజ ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో తోటి ఉద్యోగులను తీసుకుని ఇంటికి వెళ్లింది. తలుపు వేసి ఉండటంతో కిటికీ లోంచి చూడగా భర్త ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా పిల్లలిద్దరూ కాళ్లు, చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి కనిపించారు. ఆ దృశ్యాలు చూసిన తనూజ కుప్పకూలిపోయింది.

పోటీ ప్రపంచం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే పిల్లల్ని చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తమ సోదరుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఆస్తులు ఉన్నాయని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి బ్రదర్ వాపోతున్నారు. ఎంత పిల్లలు చదువులో వెనుకబడిపోతే మాత్రం ఇలా చంపేసి చచ్చిపోవటం ఏమిటి? అంటూ ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ కు గురవుతున్నారు.