తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలు చల్లదనాన్ని పొందేందుకు వీధి జ్యూస్ సెంటర్లవైపు అడుగులు వేస్తున్నారు. అయితే, వీధుల్లో అందుబాటులో ఉన్న చల్లని పానీయాలు శరీరానికి ఉపశమనం కలిగించడమే కాకుండా, శరీరానికి హాని చేసే అవకాశాలూ ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హైజిన్ పాటించని షాపుల్లో తయారు చేసే జ్యూస్లు శరీరానికి ఇన్ఫెక్షన్లుగా మారే ప్రమాదం ఉంది.

జ్యూస్ షాపులపై ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు తనిఖీలు
తాజాగా హైదరాబాద్ నగరంలోని అమీర్పేట వంటి బిజీ ప్రాంతాల్లో జ్యూస్ షాపులపై ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. తుప్పు పట్టిన ఫ్రిడ్జుల్లో నిల్వ చేసిన పాడైన పండ్లు, ఎగ్జైర్డ్ కలర్ సిరప్స్, ఈగలు, బొద్దింకల నడకలు కలిగిన వస్తువులు గుర్తించారు. అధికారులు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా, నెటిజన్లు “ఇవి చూస్తే వాంతులు వస్తున్నాయి” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.
జ్యూస్ తాగేటప్పుడు పరిశుభ్రత పట్ల అప్రమత్తం
డాక్టర్లు చెబుతున్నదేమిటంటే, బయట జ్యూస్ తాగేటప్పుడు పరిశుభ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. శుభ్రత లేని యంత్రాలు, గ్లాసులు, నీరు వంటి వాటి ద్వారా విరేచనాలు, వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే తాజా పండ్లతో శుభ్రంగా తయారు చేసుకున్న జ్యూస్లు తాగడం ఆరోగ్యానికి మేలని సూచిస్తున్నారు. ఎండల వేడిని పోగొట్టుకోవడం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలే చివరికి ఆరోగ్యానికి హాని కలిగించకుండా చూసుకోవాలి.