కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ (DK Suresh) కు మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేసారు.విచారణ నిమిత్తం ఈ సమన్లు పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.ఈ కేసులో భాగంగా జూన్ 19వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని తమ నోటీసుల్లో ఈడీ (ED) అధికారులు సూచించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు సమాచారం.ఏప్రిల్ నెలలో, ఐశ్వర్య గౌడ అనే మహిళను ఈడీ అరెస్టు చేసింది. ఈమెకు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాను పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులకు సన్నిహితురాలినని ఐశ్వర్య గౌడ (Aishwarya Gowda) చెప్పుకుందని ఈడీ తన ప్రకటనలో పేర్కొంది. బంగారం, నగదు, బ్యాంకు డిపాజిట్లపై అధిక లాభాలు ఇప్పిస్తానని చెప్పి ఆమె పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దుర్వినియోగం చేస్తున్నారని
ఈ వ్యవహారంలో డీకే సురేశ్ పేరును ఐశ్వర్య గౌడ దుర్వినియోగం చేసిందని, తాను ఆయన సోదరినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపణలు వచ్చాయి. తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని డీకే సురేశ్ గతంలోనే బెంగళూరు (Bangalore) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం గమనార్హం. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కులకర్ణి అనే వ్యక్తి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.ఐశ్వర్య గౌడ, ఆమె భర్త హరీశ్ కేఎన్తో పాటు మరికొందరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) ల ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు డీకే సురేశ్ను విచారించాలని ఈడీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Read Also: HoneyMoon Murder: మేఘాలయలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు