దేశంలో టాప్ ఐటీ కంపెనీల్లో కొన్ని మాత్రం పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టాప్ రెండవ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురించే. కరోనా సమయంలో కూడా ఫ్రెషర్ల పట్ల కంపెనీ తన కఠిన వైఖరిని చూపించిన సంగతి తెలిసిందే. చాలా కాలం ఉద్యోగంలోకి ఆన్ బోర్డ్ చేసుకోకుండా ఆలస్యం చేసింది. దీని తర్వాత ఆఫర్ లెటర్ లో ప్రకటించిన వార్షిక వేతనం కంటే తక్కువకు ఇష్టమైతే ఆన్ బోర్డ్ కావాలని కూడా కొన్ని షరతులు పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే కొందరిని పరీక్షల పేరుతో తిరస్కరించిందనే ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు స్థిమితపడటంతో టెక్ కంపెనీలకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా టాప్ టెక్ కంపెనీలు కొత్త ఉద్యోగులను ప్రధానంగా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తమ త్రైమాసిక ఫలితాల సమయంలో కూడా ప్రకటనలు చేశాయి.

తాజాగా సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్లో వరుసగా మూడు ప్రయత్నాల్లో అవాల్యుయేషన్ పరీక్షల్లో విఫలమైన ట్రైనీలను తెలగిస్తున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా దాదాపు 400 మందిని మైసూరు క్యాంపస్ నుంచి తొలగిస్తున్నట్లు విషయం తెలిసిన వర్గాల నుంచి బయటకు వచ్చింది. రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శిక్షణ పొందిన వారిని కంపెనీ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించిందని తెలుస్తోంది. అయితే ప్రస్తుత నిర్ణయం వల్ల దాదాపు సగం మంది ట్రైనీలు ఉద్యోగం కోల్పోయినట్లు తెలుస్తోంది.
అయితే దీనిపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన సైతం విడుదల చేసింది. కంపెనీలో తాము కఠినమైన నియామక ప్రక్రియను పాటిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైసూరు క్యాంపస్ లో ఫ్రెషర్లు శిక్షణ పొందిన తర్వాత అంతర్గత అసెస్మెంట్ను క్లియర్ చేయడానికి మూడు అవకాశాలను కలిగి ఉంటారని కంపెనీ వెల్లడించింది. వీటిని క్లియర్ చేయని వారు సంస్థలో కొనసాగటం కుదరదని స్పష్టం చేసింది.